ఆహార భద్రతకు పెను ప్రమాదం
వ్యవసాయ, గ్రామీణ కార్మికులు, పేదలు, పేద, మధ్య తరగతి రైతులు ఐక్యం కావాలి : ఏఐఏడబ్ల్యూయూ పుస్తక ఆవిష్కరణలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అమెరికా ఒత్తిడితో టారిఫ్లను అంగీకరిస్తే దేశ వ్యవసాయ రంగానికి ఉరితాడే అవుతోందని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం చారిత్రపై రైతు నేత, మాజీ ఎంపీ హన్నన్ మొల్లా రాసిన పుస్తకాన్ని గురువారం నాడిక్కడ రైతు సంఘం కార్యాలయంలో ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, విజ్జూకృష్ణన్, వ్యవసాయ కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, సీఐటీయూ కార్యదర్శి సాయిబాబు, ఎస్ఎఫ్ఐ నేత ఆదర్శ్, పుస్తకం రచయిత, రైతు నేత హన్నన్ మొల్లా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అమెరికా టారిఫ్ల ఉద్దేశాన్నివివరించారు. టారిఫ్లు పెంచేది, తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా ఇండియాతో ఒప్పందాలు చేసుకోవడం కోసమేనని అమెరికా అధ్యక్షుడు ట్రాంప్ బహిరంగంగా ప్రకటించారని అన్నారు. మోడీ ప్రభుత్వం ట్రంపునకు లొంగితే వ్యవసాయ రంగం విచ్ఛిన్నం అవుతుందని హెచ్చరించారు. మన ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు గోధుమ, డైరీ సర్వనాశనం అవుతాయని, వరి పంటను కంపెనీలు నియంత్రిస్తాయని పేర్కొన్నారు. ఆహార భద్రతకు పెను ముప్పు పొంచి ఉందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతిస్తే మన సహజ వనరులను దోచుకోవచ్చని సామ్రాజ్యవాదులు కుట్రలని విమర్శించారు. ఇదే జరిగితే మన దేశం నయా వలస వాదానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పత్తి పంటపై 11 శాతం దిగుబడి సుంకం తగ్గించారని, దీంతో కోట్లాది మంది పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా తయారవుతుందని అన్నారు. అమెరికా దిగుబడులకు మనం గేట్లు తెరిస్తే జరిగే వినాశనం పెద్ద సునామీ సృష్టిస్తోందని హెచ్చరించారు. కాబట్టి టారిఫ్కు అంగీకరించకుండా ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించాలని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తికి పేద, మధ్య తరగతి రైతులు, వ్యవసాయ, గ్రామీణ కార్మికులు, పేదలు, కౌలు రైతులు కీలక భూమిక పోషిస్తున్నరాని గుర్తు చేశారు. గ్రామీణ ఉత్పత్తి వర్గాలన్నీ ఐక్యం కావాలని, ధనిక వర్గానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వర్గ ఐక్యతే కంపెనీలను, ధనికులను ఓడిస్తాయని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం చరిత్రను రచించిన హన్నన్ మొల్లాను అందరూ అభినందించారు. మహాసభల సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు ఎంతో అద్భుతంగా వివరించారని తెలిపారు. వ్యవసాయ రంగంలో పనిచేసే అందరికి ఎంతో ఉపయోగమని ప్రత్యేకించి యువకులకు బాగా తోడ్పడుతుందని తెలిపారు. ఈ ఆవిష్కన సభలో ప్రజా సంఘాల నేతలు మజుందార్, ఇంద్రజిత్, బాదల్, పాండ్యన్, విమల్ పలివాల్, బాబు, మనోజ్, త్యాగి పాల్గొన్నారు.