ఉక్రెయిన్కు పుతిన్ హెచ్చరిక
మాస్కో : శాంతియుత మార్గాల ద్వారా ఘర్షణకు ముగింపు పలికే విషయంలో ఉక్రెయిన్కు పెద్దగా ఆసక్తి ఉన్నట్లు కన్పించడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. దౌత్యం విఫలమైన పక్షంలో బలప్రయోగం ద్వారా ‘ప్రత్యేక సైనిక చర్య’కు దిగుతామని ఆయన ఉక్రెయిన్ను హెచ్చరించారు. ఉక్రెయిన్పై రష్యా తన సైనిక చర్యలను తీవ్రతరం చేసింది. మరోవైపు ఉక్రెయిన్, అమెరికా అధ్యక్షులు జెలెన్స్కీ, డోనాల్డ్ ట్రంప్ మధ్య ఆదివారం ఫ్లోరిడాలో సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో పుతిన్ చేసిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఉక్రెయిన్ అధికారులు కోరుకోని పక్షంలో మా ముందు ఉన్న అన్ని లక్ష్యాలనూ సాధిస్తాం.
సైనిక చర్య ద్వారా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ చేపడతాం’ అని పుతిన్ను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ టాస్ తెలియజేసింది. శాంతియుత పరిష్కారం కనుగొనాలన్న తొందరపాటు ఉక్రెయిన్ పాలకుల్లో కన్పించడం లేదని పుతిన్ చెప్పారు. సంవత్సరం క్రితం విదేశాంగ శాఖ సమావేశంలో ఇదే మాట చెప్పానని గుర్తు చేస్తూ ఈ రోజు కూడా ఇవే మాటలు చెప్పాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. రష్యా శుక్రవారం రాత్రి ఉక్రెయిన్పై యాభై డ్రోన్లు, నలభై క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో ఓ వ్యక్తి చనిపోగా 27 మంది గాయపడ్డారు. దీనిపై జెలెన్స్కీ స్పందిస్తూ 2022 ఫిబ్రవరిలో మొదలు పెట్టిన యుద్ధాన్ని ఆపే ఉద్దేశం రష్యాకు లేదని విమర్శించారు.



