– నీటి దోపిడీని అడ్డుకోకపోగా.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతారా
– అబద్ధాల్లో సీఎంను మించిన ఉత్తం – మాజీ మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ – దుబ్బాక
“తెలంగాణ నుంచి 400 టీఎంసీ ల గోదావరి జలాలను ఏపీకి అక్రమంగా తరలిస్తుంటే ప్రభుత్వం గుడ్లప్పగించుకుని చూస్తుందా.?. వాటిని ఆపే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా.? దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కేంద్ర మంత్రులను కలవరు. నీతి ఆయోగ్ లో సీఎం మాట్లాడడు. ఏపీ నీటి దోపిడీని ఈ సర్కార్ అడ్డుకోకపోగా.. చంద్రబాబు అడుగులకు మడుగులోత్తుతుంది. గంధ మల్ల ప్రాజెక్టు కాలేశ్వరంలో అంతర్భాగం. కాలేశ్వరం కూలితే గంధం వల్లకు గోదారి జలాలు ఎట్లా వస్తాయి. మరి ఆ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి ఎలా కొబ్బరికాయ కొడుతున్నారు. అపెక్స్ కమిటీ, అంతర్రాష్ట్ర అనుమతి, గోదావరి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు కడుతుంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలి”. అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు నిలదీశారు.
చంద్రబాబును ఎదిరించే దమ్ము, సుప్రీంకోర్టుకు వెళ్లే సత్తా రాష్ట్ర సర్కార్ కు లేదని.. రేవంత్ సర్కార్ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఏపీకి దాసోహం అయిందని ఎద్దేవా చేశారు. శుక్రవారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని కేపీఆర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ తో కలిసి హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలోనే తాత్కాలిక కేటాయింపుల ప్రకారం 65 టీఎంసీలు తక్కువ వాడిన మొట్టమొదటి చేతగాని ప్రభుత్వం రేవంతుదేనని, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల పంటలన్నీ ఎండిపోయాయని మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు పై కేబినెట్లో మాట్లాడేందుకు సమయం దొరకలేదా అని, కేవలం వారి కమిషన్లు, పర్సెంటేజీలు, హై కమాండ్ కు పంపే మూటల గురించే ఐదు గంటల సమయాన్ని వెచ్చించారని ఆరోపించారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ వెళ్తుందన్న మాటకి కట్టుబడి ఉంటున్నామని స్పష్టం చేశారు.
కృష్ణా నదిలో న్యాయమైన వాటా కింద వదిలింది, గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టు కడుతుంటే, శ్రీశైలం రైట్ కెనాల్ లైనింగ్ జరుగుతుంటే ఆపకుండా చూస్తున్నది మీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. బనకచర్ల తో తెలంగాణ రాష్ట్రం గోదావరిలో వాట కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆ పనుల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేస్తే, కాంగ్రెస్ సర్కార్ వచ్చాక మొదలుపెట్టిందని, తక్షణమే ఆ పనుల్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇంతగా అన్యాయం జరుగుతుంటే ఇక్కడి కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, నాయకులు ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలన్నారు. కాలేశ్వరంలో కుంగినవి రెండు పిల్లర్లే అని, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రెండు నెలల్లో వాటిని బాగు చేయొచ్చన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను, రాష్ట్ర ప్రజలను నిరాశపరిచేలా కేబినెట్ నిర్ణయాలు తీసుకుంటుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఓపిఎస్ ను అమలు చేసి పెండింగ్ డీఏ లను క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.
దేశంలో 5 డీఏ లు పెండింగ్లో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఉద్యోగులను రాచి రంపాన పెడుతూ వారిని నిట్టనిలువునా ముంచుతున్నారని, ఉద్యోగులపై ఏసీబీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ తక్షణమే మూడు డీఏలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన డిమాండ్ చేశారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా కార్యదర్శులను ఇబ్బంది పెడుతుందని, పంచాయతీ నిర్వాహణ భారమై అప్పులు పాలయ్యారని, తెలంగాణలో అప్పు లేని పంచాయతీ సెక్రెటరీ లేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పల్లెలకు అవార్డులు వచ్చాయని, నేడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క పంచాయతీకి అవార్డు దిక్కు లేదని ఎద్దేవ చేశారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.