అంచనాలను పెంచుతున్న సర్కార్…
2024-25లో రూ.26 వేల కోట్లు తగ్గిన రాబడి
అయినా ఈసారి బడ్జెట్లో రూ.40 వేల కోట్లు పెంచిన ప్రభుత్వం
కేంద్ర గ్రాంట్లలోనూ రూ.24 వేల కోట్లు పెంచి చూపిన వైనం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలపై ప్రభావం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఒకవైపు ఖజానాకు అనుకున్నంత స్థాయిలో ఆదాయం రావటం లేదు.. కొత్త అప్పులు పుట్టటం లేదంటూ మొత్తుకుంటున్న సర్కార్… మరోవైపు తన బడ్జెట్లో మాత్రం భారీగా అంచనాలేసుకుంటూ జనాన్ని బోల్తా కొట్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఆదాయం రాకున్నా, వాస్తవ రాబడి కండ్ల ముందు కనబడుతున్నా…వాటిని విస్మరించి, ‘అతి’ అంచనాలేస్తోంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్కలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.2,90,814 కోట్లతో తన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అయితే ఆ తర్వాత సవరించిన అంచనాల్లో ఆ మొత్తంలో రూ.26,684 కోట్లు తగ్గినట్టు స్పష్టం చేసింది. అంటే ఆ మేరకు సర్కారుకు ఆదాయం రాలేదన్నమాట. ఈ వాస్తవాన్ని విస్మరించిన సర్కార్… ఈ యేడాది (2025-26) బడ్జెట్లో గత సంవత్సరపు పద్దు కంటే అదనంగా రూ.40 వేల కోట్లను పెంచి చూపటం గమనార్హం. ఆ ప్రకారంగా రూ.3,04,666 కోట్లతో ప్రభుత్వం తన బడ్జెట్ను ప్రతిపాదించింది. ఇది వాస్తవాలకు విరుద్ధంగా ప్రజల్ని భ్రమలకు గురి చేసే విధంగా ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గత బడ్జెట్లో పన్నేతర ఆదాయం రూపేణా ఖజానాకు రూ.31,618 కోట్లు వస్తాయని సర్కారు అంచనా వేసింది. కానీ అందులో రూ.20 వేల కోట్లే వచ్చాయి. అంటే ఇక్కడ వేసుకున్న అంచనాలకంటే రూ.11,618 కోట్లు తగ్గాయన్న మాట. గ్రాంట్లలోనూ ఇదే రకంగా అంచనాలేసుకున్న సర్కార్ పరిస్థితి తారుమారైంది. పన్నేతర ఆదాయం, గ్రాంట్ల రూపంలో మొత్తం రూ.54 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తే, అవి రెండూ కలిపి రూ.30 వేల కోట్లే వచ్చాయి. అంటే ఇక్కడ కూడా మరో రూ.24 వేల కోట్ల మేర ఆదాయం తగ్గిందన్నమాట. పరిస్థితి ఈ రకంగా ఉంటే…దానికి విరుద్ధంగా ప్రభుత్వం ప్రతీయేటా ఆదాయ అంచనాలను పెంచుకుంటూ పోతుండటం గమనార్హం. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు తీవ్ర విఘాతం కలుగుతోంది. వాస్తవ రాబడికి అనుగుణంగా పథకాలు, కార్యక్రమాలను అమలు చేయాల్సిన సర్కారు, అందుకు భిన్నంగా బడ్జెట్ అంచనాలను పెంచి చూపటం, ఆ మేరకు ప్రజలకు కొత్త కొత్త ఆశలు కల్పించటం, ఆ తర్వాత హామీలను అమల్జేయలేక చేతులెత్తేయటం రివాజుగా మారింది. ఆసరా పింఛన్లను పెంచకపోవటం, కొత్త పింఛన్లను మంజూరు చేయకపోవటం, వ్యవసాయ కార్మికులు, మహిళలకు ఆర్థిక చేయూత పథకాల్లో జాప్యం, రైతు బంధును (రైతు భరోసా) ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.7,500కు పెంచకపోవటం తదితరాం శాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. వాస్తవానికి గత బీఆర్ఎస్ హయాంలోనూ ఇదే తంతు (లేని ఆదాయాన్ని ఉన్నట్టుగా చూపటం) నడిచింది. పన్నేతర ఆదాయం, గ్రాంట్లనూ అప్పుడు కూడా అదే పనిగా పెంచుకుంటూ పోయారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే బాటలో నడుస్తుండటం విస్మయకర అంశం. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఏర్పడి 17 నెలలు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందైనా వాస్తవ ఆదాయాలకు అనుగుణంగా సర్కారు నడుచుకుం టుందా? లేదా? అనేది చూడాలి.
ఆదాయం రాకపోయినా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES