Wednesday, June 18, 2025
E-PAPER
Homeమానవిఇద్దరూ మాట్లాడుకుంటేనే...

ఇద్దరూ మాట్లాడుకుంటేనే…

- Advertisement -

భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్‌ తప్పని సరిగా ఉండాలి. అది లేకపోతే వారిద్దరిదీ సరైన బంధం కాదు. ఎంత బిజీగా ఉన్నా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి తప్పని సరిగా ఇద్దరూ కనీసం ఓ గంటసేపైనా మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఆ సమయంలో అది ఇదీ అని పరిమితులు పెట్టుకోకుండా కుటుంబం, వ్యక్తిగతం ఇలా అన్ని విషయాలు చర్చించుకోవాలి. ఇలాంటి చర్చ జరగనపుడు వాళ్లు ఎన్నేండ్లు కలిసి ఉన్నా ఇద్దరి మధ్య సఖ్యత పెరగదు. ఇలాంటి వారు కొన్నేండ్లకు విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంతే కాదు ఈ ప్రభావం పిల్లలపై కూడా పడుతుంది. భవిష్యత్తులో పిల్లలు కూడా ఇలాగే తయారవుతారు. అందుకే భార్యా భర్తల మధ్య ఉన్న కమ్యూనికేషన్‌కు అంతటి ప్రాధాన్యం ఉంటుంది. ఇద్దరి మధ్య అలాంటి పరిస్థితి లేనప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియజేసే కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌(ఐలమ్మ ట్రస్ట్‌)లో తెలుసుకుందాం…
కళావతికి సుమారు 50 ఏండ్లు ఉంటాయి. ఆమె భర్త సురేష్‌కి 58 ఏండ్లు. వాళ్లకి ఒక పాప, ఒక బాబు. ఇద్దరికీ పెండ్లి జరిగింది. కూతురు వేరే రాష్ట్రంలో ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి వెళుతుంది. కొడుకు రాహుల్‌కి పెండ్లి జరిగి రెండేండ్లు అవుతుంది. కొడలు రోజా కూడా ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తుంది. కుటుంబంలో అందరూ ఉద్యోగాలు చేసేవారే. ఎవరూ ఇంట్లో ఉండరు. అందరూ కలిసి ఇంట్లో ఉండడం చాలా తక్కువ. అత్తా, కోడళ్లలో ఎవరు ఇంటికి ముందుగా వస్తే వారే వంట చేస్తారు. ఉదయం మాత్రం వంట రోజానే చేస్తుంది.
అయితే ఈ మధ్య కాలంలో రోజా ఎందుకో తెలియదు కానీ ఎప్పుడూ దిగులుగా ఉంటుంది. ఇంట్లో వున్న కొంచెం సమయంలో కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడడం లేదు. కలిసి తినడం లేదు. రాహుల్‌తో కూడా సరిగా మాట్లాడడం లేదు. ఇద్దరి మధ్య ఏదో జరిగిందని కళావతికి అర్థమయింది. అదే విషయం గురించి రోజాను అడిగింది. ఆమె చెప్పింది ఏమిటంటే రాహుల్‌ ఆమెతో మాట్లాడటం లేదు. ఆమె ఏమి చెప్పినా వినడం లేదు. అసలు పెండ్లి అయి రెండేండ్లు అవుతున్నా ఇప్పటి వరకు రాహుల్‌ స్నేహితులు ఎవరు, అతనికి ఏది నచ్చుతుంది, ఏది నచ్చదు వంటి వివరాలు ఏమీ రోజాకు తెలియదు.
అతని ఇష్టాయిష్టాలు తెలుసుకునేందుకు ఆమె ఎంత ప్రయత్నించినా రాహుల్‌ ఆమెతో అస్సలు మాట్లాడడు. పోనీ ‘నేనంటే ఇష్టం లేదా’ అని ఆమె అడిగినా సమాధానం చెప్పడు. అందుకే ఆమె కూడా రాహుల్‌తో మాట్లాడడం మానేసింది. ఇదే విషయాన్ని అత్తతో పంచుకుంది. కోడలి బాధ అర్థం చేసుకున్న కళావతి కొడుకుతో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ రాహుల్‌ తల్లితో ఈ విషయాలు మాట్లాడటానికి ఇష్టపడలేదు. అందుకే ఆమె ఐద్వా అదాలత్‌ దగ్గరకు వచ్చింది.
మేము రాహుల్‌కు, రోజాకు ఫోన్‌ చేసి పిలిపించి మాట్లాడితే రోజా కళావతికి చెప్పిన విషయాలే మాకూ చెప్పింది. ఇంకా ‘నేనూ మనిషినే కదా మేడమ్‌, నాకు కొన్ని కోర్కెలు, ఆలోచనలు ఉంటాయి. నన్ను ఆయన ఒక వస్తువులా చూస్తున్నాడు. నా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు. రోజులో కనీసం ఐదు నిమిషాలు కూడా నాతో మాట్లాడడు. ఇద్దరం కలిసి భోజనం చేద్దామన్నా ఇష్టపడడు. ఆయన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కుమిలి పోతున్నాను. ఈ ఆలోచనలతో ఉద్యోగంపై శ్రద్ధ పెట్టలేక పోతున్నాను. ఇంట్లో కూడా ఎవ్వరితో మాట్లాడడం లేదు. నా పని నేను చేసుకుపోతున్నాను. ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రం నా ఇష్టంతో సంబంధం లేకుండా తన కోరిక తీర్చుకొని వెళ్లిపోతాడు. ఈ విషయం ఆయనకు చెప్పాలంటే బాధపడతాడేమో అని చెప్పడం లేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఇదే విషయం గురించి రాహుల్‌ని అడిగితే ‘మా ఇంట్లో మా అమ్మానాన్న ఇద్దరూ కూడా ఇంట్లో ఇలాగే ఉంటారు. వాళ్లిద్దరూ కలిసి మాట్లాడుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. అమ్మ పని అమ్మ చేసుకుంటుంది, నాన్న పని నాన్న చేసుకుంటాడు. అయినా ఇప్పటి వరకు మా అమ్మ ఈ విషయం గురించి ఎప్పుడూ బయటకు చెప్పుకోలేదు. వాళ్లు బాగానే ఉంటున్నారు కదా! ఇప్పుడు నేనేదో తప్పు చేస్తున్నట్టు మా అమ్మ రోజాను తీసుకొని ఇక్కడకు వచ్చింది’ అన్నాడు.
దానికి మేము ‘రాహుల్‌ మీరు చేస్తున్న పొరపాటు మీకు అర్థం కావడం లేదు. రోజా ఇంట్లో నిర్జీవంగా ఉంటుంది. ఇవేవీ మీరు గమనించడం లేదు. ఆమె మనిషి అనే విషయం మర్చిపోతున్నారు. ఆమె మనసు మీరు అర్థం చేసుకోవడం లేదు. మీ అమ్మానాన్న మాట్లాడుకోవడం లేదు అంటున్నారు. వాళ్ల తరం వేరు, మీ తరం వేరు. మీరు ఇప్పటి వాళ్లలా ఆలోచించండి. మీ ఫ్రెండ్స్‌తో ఒకసారి మాట్లాడి చూడండి. భార్యా భర్తలు అంటే ఎంత సరదాగా ఉంటున్నారో తెలుస్తుంది. మీరిద్దరూ జీవితాంతం కలిసి బతకాల్సిన వాళ్లు. మీరు ఇప్పటికైనా మీ భార్య గురించి ఆలోచించకపోతే భవిష్యత్‌లో కలిసి ఉండడం కష్టంగా మారుతుంది. మీలాంటి వ్యక్తితో ఉండేందుకు ఏ అమ్మాయి ఇష్టపడదు. ముందు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నం చేయండి. ఇద్దరూ కలిసి బయటకు ఎక్కడికైనా వెళ్లి రండి. అప్పుడు జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో అర్థమవుతుంది. ఇలా రెండు వారాలు ప్రయత్నించి మా దగ్గరకు రండి’ అని చెప్పి పంపించాము.
రెండు వారాల తర్వాత మళ్లీ రాహుల్‌, రోజా వచ్చారు. రాహుల్‌ మాట్లాడుతూ ‘మేడమ్‌ ఇన్ని రోజులు నేనేం కోల్పోయానో నాకు అర్థమయ్యింది. ఈ మధ్యనే మా ఫ్రెండ్‌ వాళ్ల పాప పుట్టిన రోజు ఫంక్షన్‌కి ఇద్దరం కలిసి వెళ్లాము. అక్కడ మా ఫ్రెండ్స్‌ అందరూ వాళ్ల భార్యలతో ఎంతో సరదాగా గడుపుతున్నారు. అది చూసిన తర్వాత నేను చేసిన పొరపాటు నాకు అర్థమయ్యింది. రోజాను కూడా ఇకపై నేను అలాగే చూసుకుంటాను. ఆమెకు నచ్చేలా ఉండేందుకు ప్రయత్నిస్తాను. మమ్మల్ని ఇక్కడకు తెచ్చిన మా అమ్మకు ముందు థ్యాంక్స్‌ చెప్పాలి. అలాగే మీకు కూడా చాలా ధన్యవాదాలు’ అన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -