నిర్మాతలతో జరుగుతున్న చర్చలు విఫలమైతే నేటి (సోమవారం) నుంచి సమ్మె సైరన్ మోగిస్తామని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్ చెప్పారు.
గత రెండు రోజులుగా ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్మాతలకు, ఫిల్మ్ ఫెడరేషన్కి మధ్య చర్చలు జరుగు తున్నాయి. ఈ క్రమంలో నిర్మాతలు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అలాగే షరతులతో కార్మికుల వేతనాల పెంపు పెంచే తీరుపై ఫెడరేషన్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా కార్మిక సంఘాలను విభజించేలా నిర్మాతల తీరు ఉందని ఆరోపించారు. కార్మికుల వేతనాల పెంపు విషయంలో నిర్మాతల ధోరణి ఎలా ఉందనే విషయాన్ని ఆదివారం ఫెడరేషన్లో ఏర్పాటు చేసిన సభలో అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్ 24 క్రాప్ట్స్కి సంబంధించిన సభ్యులందరికీ వివరించారు. నిర్మాతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేతనాలు పెంచాల్సిందేనంటూ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ‘ఆదివారం నిర్మాతలతో జరిపే చర్చలు ఫలించకపోతే సోమ వారం నుంచి చిత్రీకరణలు పూర్తిగా నిలిపివేస్తాం. ఇప్పటికే షెడ్యూల్ ఉంటే ఒకటి, రెండు రోజులు సమయం ఇస్తాం. నిర్మాత విశ్వప్రసాద్ ఫెడరేషన్కు ఎందుకు నోటీస్ పంపారో తెలీయదు. ఆయనకు నేరుగా పంపే అధికారం ఫెడరేషన్కి లేనందున ఫిల్మ్ ఛాంబర్కు నోటీసులు పంపిస్తాం. అలాగే నిర్మాత విశ్వప్రసాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఆయన సినిమా షూటింగ్లకు హాజరవ్వం. ఛాంబర్ నిర్ణయం మేరకే తుది కార్యాచరణ ఉంటుంది’ అని తెలిపారు.
చర్చలు ఫలించకపోతే సమ్మె సైరన్ మోగిస్తాం
- Advertisement -
- Advertisement -