”వెన్నెల దీపం కొందరిదా…. అడవిని సైతం వెలుగు కదా…. ఎల్లలులేని చల్లని గాలి, అందరి కోసం అందును కాదా……. ఇది తెలియని మనుగడ కథ దిశనెరుగని గమనము కదా” అంటాడు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఇందులో నిగూఢమైన త్యాగం (సేవ) దాగి వుందనేది కొందరికే తెలుసేమో బహుశా!
వెన్నెల, గాలి, సూర్యుడు, చంద్రుడు, వసంతం… ఇవి అన్నీ ప్రకతిలో భాగాలు. ఇవి ఏవీ వాటి సొంత ప్రయోజనం ఆశించి పని చేయవు. సహజసిద్ధంగా వాటి పని అవి నిస్వార్ధంగా చేసుకుంటూ పోతాయి. మరి మనిషి కూడా ప్రకతి నుండే వచ్చాడు. ప్రకతిలో భాగస్తుడే కానీ స్వార్ధం, అసూయ అతడి మనస్సును ఆవహిస్తున్నాయి. ఫలితంగా చెడు ఆలోచనలు, వాటి ద్వారా చేసే చెడ్డ పనులు మనిషి పతనానికి బాటలు వేస్తాయి.
సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి తోడ్పడవోరు అంటాడు మహాకవి గురజాడ. పొరుగు వాడికి సహాయం చేయని మనిషి మనిషేనా? మీరు అందరితో అంటీ ముట్టనట్లుగా వుంటే, మీరు ఆపదలో వున్నప్పుడు మిమ్మల్ని మాత్రం ఎవరు, ఎందుకు పట్టించుకుంటారు.
సమాజం అంటేనే మీ చుట్టూ వుండే మనుషుల కలబోత. వారితో మీరు ఎలా మసులుకుంటున్నారనేది మీ ప్రవర్తనపై ఆధారపడి వుంటుంది. దాని ఫలితమే ఇతరులు మిమ్మల్ని ఎలా గౌరవిస్తున్నారన్న దానిపై ఆధారపడి వుంటుంది. అందుకే వీలైనంత వరకు మీ ప్రేమను సమాజానికి, మీ చుట్టూ వుండే వారికి, మీ మీద ఆధారపడే వారికి, పిల్లలకు, పెద్దలకు, తోటి ప్రాణులకు పంచండి. దాని ఫలితం మీకు తిరిగి ప్రేమై వస్తుంది. దీనికి సంబంధించిన ఓ చిన్న కథను చదవండి.
ఒకవ్యక్తి తన భార్యకు బాగా ఇష్టమైన మామిడి చెట్టు వున్న ఇల్లు కొనాలనుకుంటాడు.
బంధువులు, తెల్సిన వారు వాస్తు ప్రకారం ఉందా లేదా అని చూయించుకోవాలని పట్టుబడతారు.
ఒక ఇల్లును చూసి అది వాస్తు ప్రకారం ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి ఒక వాస్తు సిద్దాంతి వద్దకు వెళ్తాడు. ఆ వాస్తు సిద్ధాంతిని తీసుకొని తను కొనాలనుకున్న ఇల్లును చూయించడానికి కారులో బయలుదేరుతారు. ఇలా వెళ్తున్న క్రమంలో వారి వాహనం వెనుక నుండి ఎవరు వచ్చి హారన్ కొట్టినా… వారికి దారి ఇచ్చి వెళ్ళమనేవాడు. ఇది గమనించిన వాస్తు సిద్ధాంతి ఎందుకిలా చేస్తున్నారని అడిగితే వారికి మనకన్నా ఇంకా ఏమైనా అత్యవసరం వుండి ఉండవచ్చు. వారికి మనం దారి ఇస్తే త్వరగా వారు చేరాల్సిన గమ్యానికి చేరుకుంటారు కదా అంటాడు. అలా కొన్న ఇంటి దగ్గరికి వారి కారు వచ్చే క్రమంలో ఒక పిల్లవాడు ఆడుకుంటూ కారు ముందుకు వస్తాడు.
వెంటనే కారు ఆపి పిల్లవాడికి దారి ఇస్తాడు. కొద్దిసేపటికి ఆ సిద్ధాంతిని ఇంకా ఎవరైనా వస్తున్నారా చూడండి అని అడుగుతాడు. ఈ క్రమంలో రెండవ పిల్లవాడు వారి కారు ముందు నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు సిద్ధాంతి మీరు ఎలా ఊహించారు? అని అంటాడు. అప్పుడు అతను పిల్లవాడు ఒక్కడే ఆడుకోడు కదండి. కాబట్టి కొద్దిసేపు ఆగాను అంటాడు. అలా ఇంటి ముందుకు రాగానే మామిడి చెట్టుపై నుండి పక్షులు ఎగిరిపోవడం చూసి, కారు యజమాని గురువు గారు ఇప్పుడే కారు దిగకండి. మనం కారులోనే వుండి వాళ్ళు వెళ్ళాక వెళదాం అంటాడు.
కానీ ఆ వాస్తు గురువు అక్కడ ఎవరు లేరు కదా! అని మనసులో అనుకుంటూ చూస్తుండగానే కొంతమంది పిల్లలు వచ్చి ఆ మామిడి చెట్టుకు రాలిన పళ్ళను తీసుకొని వెళ్తారు. అది చూసి షాక్ ఐన గురువు గారితో నవ్వుతూ ఇలా అంటాడు… పిల్లలు పక్షులను రాళ్ళతో కోడితేనే కదండి అవి ఎగిరిపోయాయి. ఇప్పుడు వారు మనల్ని చూస్తే ఇంకా భయపడిపోతారు. కాబట్టి వారు వెళ్ళాక వెళ్దాం. లేకపోతే వారు కంగారుపడి, భయంతో పరుగుతీసే క్రమంలో కిందపడితే దెబ్బలు తగులుతారు అంటాడు. మరో రెండు అడుగులు వేశాక గురువు గారు పక్కింటి వారు మనల్ని చూస్తుంటారు, వారిని పలకరించి వెళ్దాం అంటాడు. దానికి గురువు గారు వారు మన గురించి ఎందుకు ఆలోచిస్తారు? అని అడుగగా ఈ ఇంట్లోకి ఎలాంటి వారు వస్తున్నారో, వారితో మనకేమైనా ఇబ్బందులుంటాయేమోనని దిగులుంటుంది వారికి. వారు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే వుంటున్నారు. మనం ఈ ఇంటికి కొత్తగా రాబోతున్నాం. కాబట్టి వారికి దిగులు సహజంగానే వుంటుంది కదండీ అంటాడు.
అప్పుడు గురువు గారు ఇలా అంటాడు… వాస్తు అంటే ప్రకతి, పరిసరాలు, మంచి మనస్సు, పక్షులు వాటి ప్రశాంతతను గౌరవించడం, అలాగే అన్నింటిలోనూ మంచిని చూస్తూ అందరికి సహాయపడే గుణం వున్న మీ లాంటి మంచి మనసున్న వారికి వాస్తు ఎప్పుడూ అనుకూలంగానే వుంటుంది. ఎప్పుడూ శుభమే జరుగుతుంది. కానీ సమాజాన్ని ప్రేమించే వారిని ఇంటివారు చిన్న చూపు చూస్తారు. అదొక్కటి మనసులో ఉంచుకోండి అనిచెప్పి వెళ్ళిపోతాడు. చూశారుగా మీరు కూడా ఎవరిలోనైనా మంచినే చూడండి. చెడ్డ వ్యక్తులు, మంచి వ్యక్తులు అనే వారు మనం అనుకునేవే. ‘లోపం లేనివారు ఎవరో చెప్పండి’ అంటారు సి.నా.రె. అందుకే లోపాన్ని కాదు వెతికేది, మంచిని వెతకండి లేదా పంచండి. మీకు కూడా మంచే ఎదురు వస్తుంది.
(నవతెలంగాణ పత్రిక దశమ వార్షికోత్సవం సందర్భంగా)
- డా||మహ్మద్ హసన్,
9908059234