ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లు చీలొద్దు
యువత రాజకీయాల్లోకి రావాలి: టీఆర్ఎల్డీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్
హైదరాబాద్లో ప్రారంభమైన రెండో విడత సామాజిక చైతన్య రథ యాత్ర
నవతెలంగాణ-సిటీబ్యూరో
బీసీల ఉద్యమ చైతన్యం, ఎస్సీ, ఎస్టీల ఐక్యత పోరాటరూపం దాల్చితే రాజ్యాధికారం దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. గురువారం మధ్యాహ్నాం 12 గంటలకు హైదరాబాద్లోని ఆర్ఎల్డీ క్యాంపు కార్యాలయం వద్ద రెండో విడత సామాజిక చైతన్య రథ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా దిలీప్కుమార్ మాట్లాడుతూ మొదటి దశ సామాజిక చైతన్య రథ యాత్రలో తెలంగాణ అంతటా బీసీల ఉద్యమ చైతన్యం, ఎస్సీ, ఎస్టీల ఐక్యత కనిపించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లు చీలకుండా రాజకీయాలు చేస్తే రాబోయే కాలంలో రాజ్యాధికారం దక్కడం ఖాయమని ఆశాబావం వ్యక్తం చేశారు.
ఆర్ఎల్డీ జాతీయ మహిళా అధ్యక్షురాలు కపిలవాయి ఇందిరా మాట్లాడుతూ యువతను రాజకీయాల్లోకి రావాలని తమ పార్టీ ప్రోత్సహిస్తుందని అన్నారు. అదే సామాజిక స్పృహతో రాబోయే రోజుల్లో ఆ వర్గాలకే ఎక్కువ సీట్లు కేటాయిస్తామని అన్నారు. విజిఆర్ నారగోని మాట్లాడుతూ ఆర్ఎల్డీ లాంటి సామాజిక చైతన్యం కలిగిన పార్టీతో జతకట్టి అతి త్వరలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడుతుందని, దానికి జయంత్ సింగ్ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ జయంత్ సింగ్ తాతగారైన మాజీ ప్రధాని చరణ్సింగ్ ఆధ్వర్యంలో మండల కమిషన్ ఏర్పాటు అయ్యిందని, ఆయన బాటలో అజిత్ సింగ్ కూడా నడిచారన్నారు. నేటి తరం యువకుడు జయంత్ సింగ్ కూడా బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంలో నిబద్ధతతో పోరాడాలని పిలుపు నిచ్చారు.
ముఖ్య అతిథి జయంత్ సింగ్ మాట్లాడుతూ ఆర్ఎల్డీ పార్టీ మొదటి నుంచీ తెలంగాణకు కట్టుబడి ఉన్న పార్టీ అని సామాజిక తెలంగాణను ఆకాంక్షించిన పార్టీ అని పేర్కొన్నారు.బీసీలకు జనాభా ఆధారంగా చట్టబద్దమైన రిజర్వేషన్లు అమలు కావాలని కోరారు. రాబోయే రోజుల్లో రాష్ట్రీయ లోక్దళ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను పోటీలో నిలబెడుతుందన్నారు. ప్రజలు బోర్పంపుకు ఓటు వేసి సంపూర్ణ మద్ధతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎల్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి గోపాల్రెడ్డి, హైదరబాద్ అధ్యక్షులు ఎంఎస్.బైగ్, యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్షులు బీరప్ప, ప్రధాన కార్యదర్శులు మడకం ప్రసాద్దొర, రిషబ్, విశాల్, మల్లేశ్, నరసింహరావు, సతీష్, జానీ, రాంప్రసాద్, బుల్లెట్ వెంకన్న కళాబృందం, సిద్దంకుమార్ తదితరులు పాల్గొన్నారు.



