– ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి..
– ఊరుకొండను కల్వకుర్తి డివిజన్ లోనే ఉంచాలి
– కల్వకుర్తి జిల్లా ఏర్పాటుచేసి అందులోనే కలపాలి
– జేఏసీ నాయకులు, నర్సంపల్లి మాజీ సర్పంచ్ నిరంజన్ గౌడ్
నవతెలంగాణ – ఊరుకొండ
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఊరుకొండ మండలాన్ని జడ్చర్ల రెవెన్యూ డివిజన్ లో కలుపుతామని.. మాట్లాడడం సమంజసం కాదని.. ఊరుకొండ మండలాన్ని కదిలిస్తే అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని.. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోనే ఊరుకొండ మండలాన్ని కొనసాగించాలని జేఏసీ నాయకులు, నర్సంపల్లి మాజీ సర్పంచ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ఊరుకొండ మండల కేంద్రంలోని కల్వకుర్తి – జడ్చర్ల ప్రధాన రహదారి పక్కన ఊరుకొండ మండల అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరుకుంది. మూడో రోజు దీక్షకు ముందూ దీక్షలో కూర్చున్న జేఏసీ నాయకులు ముందుగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని దీక్షా శిబిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు.
దీక్షకు మద్దతుగా జేఏసీ నాయకులు, బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ సభ్యులు, కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు పూర్తి మద్దతు ఇవ్వడంతో పాటు ఊరుకొండ మండలాన్ని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ లోనే కొనసాగించాలని.. లేని పక్షంలో మండల ప్రజల సహకారంతో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని.. ప్రజల అభీష్టం మేరకు ఊరుకొండ మండలం విషయంలో చేపడుతున్న దీక్షను.. అనుకున్నది సాధించే వరకు విరమించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, నర్సంపల్లి మాజీ సర్పంచ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ.. ఊరుకొండ మండలాన్ని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్లోనే కొనసాగించాలనీ.. భవిష్యత్తులో కల్వకుర్తి జిల్లాగా ఏర్పడితే ఊర్కొండను కల్వకుర్తి జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. భౌగోళికంగా కల్వకుర్తికి అత్యంత సమీపంలో ఉన్న మండల ప్రజలకు అన్ని రకాలుగా కల్వకుర్తితోనే అనుబంధం ఉందన్నారు.
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మండలాన్ని అటు ఇటు మార్చాలని చూడటం ప్రజలను ఇబ్బంది పెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఓట్లతో గెలుపొందిన ప్రజాప్రతినిధులు ప్రజల సౌకర్యం కోసం చూడాలి తప్ప,. ఇబ్బందులు సృష్టించకూడదు అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి ప్రాంత వాసి కాబట్టి, ఇదే సరైన సమయమని కల్వకుర్తిని జిల్లాగా ప్రకటించి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారం చేయాలని కోరారు.
తమ డిమాండ్లు నెరవేరే వరకు అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో ఊరుకొండ మండల కేంద్రంలో చేస్తున్న ఈ పోరాటం ఆగదని, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొమ్ము రాజయ్య, తాలూకా అఖిలపక్ష జేఏసీ చైర్మన్ కానుగుల జంగయ్య, సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్, తాడేం చిన్నా, వెంకటయ్య గౌడ్, డాన్ శివ, సుధాకర్, అరవింద్ గౌడ్, జర్నలిస్టులు బుడుమ జంగయ్య, పయ్యావుల జంగయ్య, వెంకటేష్,, మల్లేష్, గోపీ, రాజ్ నారాయణ రెడ్డి, వివిధ పార్టీల ప్రతినిధులు, ఇప్పపహాడ్ ఉపసర్పంచ్ శివ, రాజా గారు నాగరాజు, మైసయ్య, కుల సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, మండల యువకులు, మండల ప్రజలు, పాల్గొని మద్దతు తెలిపారు.



