– సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్
– గబ్బిలాల్లా వేలాడుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు : సిరిసిల్లలో బీఆర్ఎస్ సర్పంచ్ల ఆత్మీయ సమావేశం
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నారని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ ్రెడ్డికి దమ్ముంటే.. బీఆర్ఎస్ నుంచి అక్రమంగా చేర్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలు ఏవైపు ఉన్నారో నిర్ణయి స్తారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ సర్పంచ్ల ఆత్మీయ సమావేశం లో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట మార్చడంలో సిద్ధహస్తుడని విమర్శించారు. నిన్న హైదరాబాద్ ప్రెస్మీట్లో రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ 66 శాతం గెలిచింది.. ఇది ప్రభుత్వంపై ప్రజల ఆశీర్వాదమని గొప్పలు చెప్పారని, మళ్లీ మాట మార్చి.. ఇవి స్థానిక అంశాలపై జరిగిన ఎన్నికలని, ప్రభుత్వానికి సంబంధం లేదని తప్పించుకున్నారని అన్నారు. ”ముఖ్యమంత్రి.. మీకు నిజంగానే 66 శాతం ప్రజాదరణ ఉంటే, నా సవాల్ స్వీకరిం చండి. మా పార్టీ నుంచి మీరు సంతలో పశువుల్లా ఎత్తుకెళ్లిన ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిం చండి. అప్పుడు ప్రజలే చెప్తారు ఎవరి శాతం ఎంతో.. ఎవరి బతుకెంతో.. ఎవరి సత్తా ఎంతో ప్రజాక్షేత్రంలోనే తేలిపోతుంది’ అని కేటీఆర్ అన్నారు. గతంలో మంత్రులుగా, స్పీకర్లుగా పనిచేసిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కూడా కేవలం గడ్డిపోచలాంటి పదవుల కోసం ఇంతలా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. బయట కాంగ్రెస్లో చేరామని మైకుల్లో ప్రగల్భాలు పలికి, రాహుల్ గాంధీ కండువా కప్పారని చెప్పుకున్న ఈ పెద్ద మనుషులు .. ఇప్పుడు స్పీకర్ విచారణలో మాత్రం తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని పచ్చి అబద్ధాలు చెబుతు న్నారని విమర్శించారు. పదవుల కోసం సూరు పట్టుకొని గబ్బిలాల్లా వేలాడుతున్న వీరి బతుకులు పూర్తిగా ఆగమైపోయాయని అన్నారు. ఆటలో అంపైర్గా ఉండాల్సిన స్పీకర్ కూడా తాము ఇచ్చిన ఆధారాలు పక్కన పెట్టి సీఎం చెప్పినట్టు అబద్ధాలు ఆడక తప్పని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారని ఆరోపించారు. రైతులను, మహిళలను, బీసీలను మోసం చేసినందుకే ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘సిరిసిల్లలో 117 పంచాయతీల కు గాను 80 చోట్ల బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలవడమే దీనికి నిదర్శనం. పల్లెలు బాగుపడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని ప్రజలు మరోసారి తేల్చి చెప్పారు’ అని అన్నారు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రభంజనం కొనసాగిస్తామని చెప్పారు.
దమ్ముంటే ఆ పది మందితో రాజీనామా చేయించు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



