– హైదరాబాద్ నగర సీపీ, డీజీ సివి.ఆనంద్
– భద్రత ఏర్పాట్ల తనిఖీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం ప్రక్రియ జరిగేలా చూడాలని హైదరాబాద్ నగర సీపీ, డీజీ సివి.ఆనంద్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాన్ని సోమవారం ఆయన స్వయంగా పరిశీలించారు. వెస్ట్జోన్ పరిధిలో గణేష్ నిమజ్జనం బందోబస్తును తనిఖీ చేశారు. అనంతరం సివిల్, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీపీ వారికి దిశానిర్దేశం చేశారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సాఫీగా సాగేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అసాంఘిక శక్తులు, పిక్ పాకెటర్లతోపాటు ఈవ్ టీజర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గణేష్ విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేసేవిధంగా నిర్వాహకులతో సంప్రదింపులు చేయాలన్నారు. బోరబండా, రహమాత్నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సీపీ పర్యటించారు. మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు ఎస్ఎమ్ విజరుకుమార్, కె.అపూర్వరావు, బికె.రాహుల్ హెడ్గే, అదనపు డీసీపీ ఇక్వాల్ సిద్ధీఖీతోపాటు ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.
నెక్లెస్ రోడ్డులో కమిషనర్ పర్యటన
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నెక్లెస్ రోడ్డు మార్గంలో పీపుల్స్ ప్లాజా, సన్ రైజింగ్ పాయింట్, లేక్ వ్యూ పార్క్ బతుకమ్మ కుంట, సంజీవయ్య పార్క్ బేబీ పాండ్లలో నిమజ్జన ఏర్పాట్లను అదనపు కమిషనర్ రఘు ప్రసాద్తో కలిసి కమిషనర్ పరిశీలించారు. బారికేడింగ్, లైటింగ్, క్రేన్ల ఏర్పాటు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించారు. సకాలంలో గణేష్ ప్రతిమలను నిమజ్జనానికి తరలించాల్సిందిగా నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. గణేష్ ప్రతిమల ఊరేగింపు జరిగే మార్గాల్లో నిర్దేశించిన గార్బేజి పాయింట్లలోనే చెత్తను వేయాలని ప్రజలకు కమిషనర్ సూచించారు.