దానికి వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేద్దాం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మికవర్గానికి ప్రబల శత్రువు సామ్రాజ్యవాదమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. అందుకే దానికి వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ‘రెడ్ బుక్ డే’ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచంలో పీడిత ప్రజల విముక్తి కోసం, శ్రామిక ప్రజల్ని జాగృతం చేసిందని చెప్పారు. 1848 ఫిబ్రవరి 21న ప్రధమ ముద్రణ జరిగిందనీ, ఆ రోజును ”రెడ్ బుక్ డే”గా సీఐటీయూ ఆధ్వర్యంలో సామూహిక పఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ”ప్రపంచ కార్మికులారా ఏకంకండి!” పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప” అని కమ్యూనిస్టు మ్యానిఫెస్టోలో ప్రస్తావించిన మార్క్-ఎంగెల్స్ వ్యాఖ్యలు పెట్టుబడిదారీ వ్యవస్థను ఉలికిపాటుకు గురిచేశాయని చెప్పారు.
ఆ ప్రణాళిక రచించి 178ఏండ్లు గడిచినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా శ్రమదోపిడీ కొనసాగుతున్నదనీ, దోపిడీరూపాలు మాత్రమే మారాయని తెలిపారు. సామ్రాజ్య వాద దేశాలు ఫైనాన్స్ పెట్టుబడి పేరుతో కొత్త దోపిడీ పద్ధతులను కొనసాగిస్తున్నాయని విమర్శించారు. సుదీర్ఘమైన పని గంటలు, అతి తక్కువ వేతనాలు, భద్రత కరువైన ఉద్యోగాలు, కనీస వేతనాల పెంపు, పెన్షన్ సౌకర్యం, ప్రభుత్వరంగ పరిరక్షణ, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం ఈ నెల12 దేశవ్యాప్త సమ్మె జరిగిందని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్ అనుకూల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగానే ఆ సమ్మెను చూడాలని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్ధిక స్వావలంబనను, సార్వభౌమత్వాన్ని ధ్వంసం చేస్తూ అమెరికన్ సామ్రాజ్యవాదానికి లొంగుబాటుతో వ్యవహరిస్తోందని విమర్శించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం దీర్ఘకాలికమైందనీ, ఈ కర్తవ్యం అమలుకు రాష్ట్రంలోని సీఐటీయూ శ్రేణులు, అన్ని స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తలు ”రెడ్ బుక్ డే” స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్మికవర్గానికి శత్రువు సామ్రాజ్యవాదమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



