కవితకు కోర్టులో న్యాయం జరిగింది
మద్యం కుంభకోణంతో రాజకీయంగా నష్టపోయాం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలకు సంబంధించి చివరికి న్యాయమే గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు మద్యం కుంభకోణంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన శుక్రవారం ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. మద్యం కుంభకోణం అనే సాకుతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారని విమర్శించారు. ఆ కేసు వల్ల తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా బీఆర్ఎస్ నష్టపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కవితకు కోర్టులో న్యాయం జరిగిందని తెలిపారు. ఇదే విధంగా తమ నాయకులపై నమోదైన ప్రతి కేసు కూడా అబద్ధమనీ, రాజకీయ ప్రేరేపితమనీ, కల్పితమని త్వరలోనే తేలిపోతుందని పేర్కొన్నారు. సత్యం గెలిచే వరకు, కాంగ్రెస్, బీజేపీలు చేసే బాధ్యతారహితమైన ఆరోపణలను చూశామని తెలిపారు. అసత్య పూరిత కుట్రపూరిత కేసులను ఆరోపణలను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యతనిస్తూ, న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్న అనే ధోరణి ఈ ‘నవ భారతం’లో అలవాటుగా మారిపోయిందని వివరించారు.
కడిగిన ముత్యంలా సుప్రీం తీర్పు : వినోద్కుమార్
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి కడిగిన ముత్యంలా సుప్రీం కోర్టు తీర్పు ఉంటుందని ఆనాడే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారనీ, ఇప్పుడు తీర్పు అలానే వచ్చిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అల్లిన కుట్రలు ఒక్కొక్కటిగా వీగిపోతుండటం హర్షించదగ్గ విషయమని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత వంటి నాయకులపై మోపిన అక్రమ కేసులు కేవలం రాజకీయ కక్షతో కూడుకున్నవని కోర్టు తీర్పుల ద్వారా స్పష్టమవుతోంని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎంతటి దుష్ప్రచారం చేసినా చివరికి సత్యమే గెలిచిందని తెలిపారు.
తీర్పును స్వాగతిస్తున్నాం : దేవీప్రసాద్
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మెన్ జి దేవీప్రసాద్ తెలిపారు. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కల్పిత మద్యం కుంభకోణం పేరుతో దుష్ప్రచారం చేసి బీజేపీ, కాంగ్రెస్ కలిసి కూల్చాయని పేర్కొన్నారు. బీజేపీ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కవితను అరెస్టు చేశారని తెలిపారు. రాజకీయంగా బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుఉని అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి దుష్ప్రచారం చేశాయని పేర్కొన్నారు. దాంతో బీఆర్ఎస్ కొంత నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని తెలిపారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులకు సిట్ నోటీసులను ఇచ్చిందని పేర్కొన్నారు. అవన్నీ అబద్ధాలని త్వరలో తెలుస్తాయని తెలిపారు.
చివరికి న్యాయమే గెలిచింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


