Saturday, June 28, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఆ చీకటి రోజుల్లో...

ఆ చీకటి రోజుల్లో…

- Advertisement -

సరిగ్గా యాభై ఏండ్ల క్రితం మన దేశంలో 1975 జూన్‌ 25న తేదీ అర్ధరాత్రికి అతి కొద్ది నిమిషాల ముందుగా ”అత్యవసర పరిస్థితి” విధించబడింది. అర్ధ శతాబ్ది అనంతరం ఆనాటి 21మాసాల ‘చీకటి రోజుల’ గురించి మననం చేసుకుందాం. 1971లో జరిగిన సాధారణ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల అనంతరం ఇందిరా గాంధీపై లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయిన సోషలిస్టు పార్టీ అభ్యర్థి రాజ్‌ నారాయణ్‌ ఎన్నికల ఫలితాలపై కోర్టుకెక్కారు. ఆ కేసు వాద ప్రతివాదాలలో బయటపడిన అనేక అంశాలు, ఎన్నికల్లో జరిగిన అవకతవకలు, ప్రభుత్వాధికారులు సాగించిన అధికార దుర్వినియోగాన్ని బయటపెట్టాయి. వాదనలు విన్న అలహాబాద్‌ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నికను పక్కన పెట్టడమేగాక ప్రత్యర్థి రాజ్‌ నారాయణ్‌ విజయం సాధించినట్లుగా ప్రకటించింది.
అప్పటికే కాంగ్రెస్‌ పార్టీ విబేధాలతో రెండుగా విడిపోవడం, ఉవ్వెత్తున ఎగిసిన ప్రతిపక్ష ఉద్యమాలు 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం వల్ల దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, కార్మిక రంగం విస్తృతంగా సమ్మెలకు, ఉద్యమాలకు పిలునివ్వడంతో ప్రభుత్వం దాదాపుగా స్తంబించింది. ఈ ఆటుపోట్లకు తట్టుకోలేక ఇందిరా గాంధీó ప్రభుత్వం 1975 జూన్‌ 25న అర్ధరాత్రి దేశంలో ”అత్యవర పరిస్థితి”ని ప్రకటించింది. ఒక్కసారిగా దేశం యావత్తూ అంధ యుగంలోకి అడుగు పెట్టినట్లయింది. ఎమర్జెన్సీ కేంద్ర ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాన్ని కట్టబెట్టింది. వాక్‌ స్వాతంత్య్రం మృగ్యం కావడం, నలుగురు కలిసి ఒకచోట కూడడంపై నిషేధం, వ్యక్తిగత స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు, భావ ప్రకటనా స్వాతంత్య్రం హరించడం వంటి అనేక దుశ్చర్యలతో మేధావులు, కార్మిక నాయకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే అసలు ప్రభుత్వం ఆశించింది దేశంలో ఆర్థిక, రాజకీయ అస్థిరతను అధిగమించడం, ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయడం, కాని ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నమైన ఫలితాలు ఎదురయ్యాయి.
ప్రముఖ ప్రతిపక్ష నాయకుల్ని అరెస్టు చేయడం (పి.డి యాక్ట్‌ ద్వారా) పత్రికలపై ఘోరమైన సెన్సార్లు, పౌర హక్కులను హరించడంతోపాటు ప్రచురణ పూర్వమే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలనే షరతులతో పత్రికా సంపాదకులు ఎంతోఒత్తిడికి గురయ్యారు. ప్రజల ప్రాథమిక హక్కులు హరించబడడం, విచారణ లేకుండా డిటెన్షన్లు సాధారణమయ్యాయి. బలవంతపు కుటుంబ నియంత్రణ మాటున అవివాహితులకు కూడా ఆపరేషన్‌ చేయించడం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, తప్పుడు కేసులతో ఆరెస్టులు ప్రజానీకంపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఎమర్జెన్సీ చీకటి రోజులుగా పేరొందిన ఆ 21 నెలలు ప్రజలకు దినదిన గండంగా గడిచాయి. స్వయంగా నేను కూడా ఎమర్జెన్సీ బాధితురాలినే. 1975 ఎమర్జెన్సీలో మధుపై అరెస్ట్‌ వారెంట్‌ అందింది. అప్పుడు నేను విజయవాడలో ఉద్యోగంలో వున్నాను. నేను హైదరాబాద్‌కు బదిలీ చేయించుకున్నాను. హైదరాబాద్‌ నగర కార్యదర్శి కామ్రేడ్‌ ఎన్‌.వి.భాస్కరరావు అజ్ఞాతంలో మా ఇంట్లోనే వున్నారు. ఎక్కువగా నాన్న వచ్చేవారు. కాటూరు నుంచి నాగళ్ల జానకిరామయ్య వచ్చి 15 రోజులు వుండి వెళ్లేవారు.
రోజులు గడిచేకొద్దీ ప్రజలలో నిర్బంధాల పట్ల విముఖత పెరిగి సమ్మెలు, నిరసనలు, ప్రదర్శనలు మరింత ఎక్కువయ్యాయి. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేని ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన నిరసనల ప్రచారం ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. ఇందిరమ్మ, సంజరు గాంధి చిత్తుచిత్తుగా ఓడిపోయారు. నాలుగు పార్టీల కలయికతో ఏర్పాటైన జనతా కూటమి విజయం సాధించింది. దాంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న రాత్రి ప్రతిభ అస్సలు నిద్ర పోనేలేదు. మాటి మాటికి కళ్లు తెరిచి ఇందిరా గాంధీ ఓడిపోయిందా? మనం నాన్న దగ్గరకు వెళ్తున్నామా? అని అడుగుతూనే వున్నది. తను కోరుకున్నట్లుగానే కొద్దిరోజుల్లోనే మేం ముగ్గురం కలిసి విజయవాడలో వుండగలిగాము.
ఎమర్జెన్సీ యాభయ్యేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని వున్నాయి. ఈ అర్ధ శతాబ్దంలో అధికారంలో వున్న పార్టీలు మారినా వారి నిరంకుశ ధోరణిలో మార్పు రాలేదు. అందువల్ల మనం నేటికీ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు మరింత జాగరూకులుగా వుండడం ద్వారానే ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను పరిరక్షించుకోగలం.
వి.సుమతి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -