స్కూల్ బస్సుల ఫిట్నెస్ తనిఖీ చేయండి
ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఆర్థిక సాధికారిత
వివిధ శాఖల సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రవాణాశాఖలో ఎన్ఫోర్స్మెంట్ను పెంచి, ప్రజలకు సురక్షితమైన రోడ్డు భద్రతను అందించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్పై తనిఖీలు చేయాలనీ, దాన్ని అవకాశంగా తీసుకొని వేధింపులకు పాల్పడవద్దని హెచ్చరించారు. మంగళవారంనాడాయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా స్కూళ్లలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిరంతరంగా చేపట్టాలన్నారు. ప్రతి స్కూల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటయ్యేలా రవాణాశాఖ అధికారులు స్థానిక నాయకులతో కలిసి సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు 186.5కోట్ల మంది మహిళలు రూ.6,222 కోట్ల విలువైన ఉచిత ప్రయాణాన్ని చేశారనీ, మహాలక్ష్మి పథకం విజయవంతానికి ఆర్టీసీ ఉద్యోగులు చేసిన కృషి అభినందనీయమని అన్నారు. హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలనీ, ఆ మేరకు ప్రణాళికలు రూపొందించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో అడ్మిషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలనీ, గురుకులాల్లో ఒక్క ఖాళీ సీటు కూడా ఉండకూడదని చెప్పారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం వెంటనే అందజేయాలన్నారు. గురుకులాల్లో అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్, బీసీ సంక్షేమశాఖ సెక్రటరీ శ్రీధర్, గురుకులాల సెక్రటరీ సైదులు, రవాణా శాఖ జేటీసీలు, ఆర్టీసీ, రవాణా, బీసీ సంక్షేమశాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎన్ఫోర్స్మెంట్ పెంచండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES