Friday, May 23, 2025
Homeరాష్ట్రీయంతెలంగాణలో రైల్వే కనెక్టివిటీ పెంచండి

తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ పెంచండి

- Advertisement -

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 అనుమతించండి
పెండింగ్‌ ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయించాలి :
కేంద్రానికి మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణలో రైల్వే కనెక్టివిటి పెంచడంతో పాటు పెండింగ్‌ ప్రాజెక్ట్‌లకు నిధులను విడుదల చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని పలు రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. వరంగల్‌ రైల్వే స్టేషన్లో పొంగులేటి, బేగంపేట రైల్వే స్టేషన్లో కొమటిరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్ట్‌ల పురోగతి, కొత్త వాటి అనుమతి, నిధుల మంజూరు విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా వారు ప్రధానిని కోరారు. రూ. 24,500 కోట్ల వ్యయంతో 76 కిలోమీటర్ల పరిధిలో రెండో విడత హైదరాబాద్‌ మెట్రో నిర్మాణ పనులను చేపట్టేందుకు అనుమతులతో పాటు నిధులను విడుదల చేయాలనీ, రీజనల్‌ రింగ్‌ రోడ్‌కు సమాంతరంగా రైల్వేలైన్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వికారాబాద్‌-కృష్ణా, కల్వకుర్తి-మాచర్ల, డోర్నకల్‌-మిర్యాలగూడ, డోర్నకల్‌-గద్వాల ప్రతిపాదిత రైలు మార్గాలను పరిశీలించాలని కోరారు. మిర్యాలగూడ, నల్లగొండ రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలనీ, యాదగిరి టూ హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సెంట్రల్‌, నార్త్‌ సెంట్రల్‌ రైల్వేకి మధ్యగా ఉన్న కాజీపేట స్టేషన్‌ను డివిజన్‌గా ప్రకటించాలని కోరారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా రైల్వేల అనుసంధానాన్ని పెంచడానికి ఆరు కొత్త రైల్వే లైనన్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం అవసరమైన భూసేకరణ సహా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -