– 59,692 మంది పాస్
– పేపర్-1లో 61.50 శాతం, పేపర్-2లో 33.98 శాతం అర్హత
– ఫలితాలు విడుదల
– అర్హత సాధించనివారు 77,737 మంది
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను మంగళవారం హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విడుదల చేశారు. గతేడాది కంటే ఇప్పుడు టెట్లో స్వల్పంగా ఉత్తీర్ణత పెరిగింది. గతనెల 18 నుంచి 30 వరకు టెట్ రాతపరీక్షలను ఆన్లైన్లో నిర్వహించిన విషయం తెలిసిందే. టెట్ పేపర్-1కు 63,261 మంది దరఖాస్తు చేయగా, 47,224 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 29,043 (61.50 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. టెట్ పేపర్-2కు 1,20,392 మంది దరఖాస్తు చేస్తే 90,205 మంది హాజరయ్యారు. వారిలో 30,649 (33.98 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో పేపర్-2 మ్యాథ్స్, సైన్స్కు 66,686 మంది దరఖాస్తు చేస్తే 48,998 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 17,574 (35.87 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. టెట్ పేపర్-2 సోషల్ స్టడీస్కు 53,706 మంది దరఖాస్తు చేయగా, 41,207 మంది పరీక్ష రాశారు. వారిలో 30,649 (31.73 శాతం) మంది అర్హత పొందారు. గత టెట్లో పేపర్-1లో 59.48 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఈసారి టెట్ పేపర్-1లో గతం కంటే 2.02 శాతం అధికంగా ఉత్తీర్ణత పొందడం గమనార్హం. గత టెట్లో పేపర్-2లో 31.21 శాతం ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఈసారి టెట్ పేపర్-2లో గతం కంటే 2.77 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. టెట్ ఫలితాల కోసం https://schooledu.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, టెట్ చైర్పర్సన్ ఈ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
