ఇతర శాఖల్లో ఆదాయ పెరుగుదలకు కమిటీలు
సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీత పనులు వేగవంతం చేయండి : ఆదాయ వనరుల సమీకరణ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కమర్షియల్ టాక్స్ శాఖలో 4.7 శాతం, మైన్స్ శాఖలో 18.6 శాతం పెరుగుదల ఉండగా, ఇతర శాఖల్లో ఆదాయ సమీకరణలో వెనుకబాటు కనిపిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ సబ్ కమిటీ సమావేశం కమిటీ చైర్మెన్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కమిటీ సభ్యులు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ పూడికతీత పనులతో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిలువ సామర్థ్యం పెరగడంతో పాటు ఇసుక ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందనీ మంత్రి ఉత్తమ్ వివరించారు. మొదట ఒక ప్రాజెక్టులో పూడికతీత కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక తవ్వకం పనులను పూర్తిగా ట్రైబల్ ఏజెన్సీల ద్వారా నిర్వహించాలని మంత్రులు సూచించారు. గిరిజనులకు ఐటీడీఏలోని ఇంజనీరింగ్ విభాగం యంత్ర సామాగ్రిని అందించాలని మంత్రులు సూచించారు. దీని ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమల తరలింపునకు మూడు వారాల్లో విధి విధానాలు రూపొందించాలని మంత్రులు సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ అండ్ బి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, మైన్స్ డైరెక్టర్ శశాంక, స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.