సెప్టెంబర్లో 5.2 శాతంగా నమోదు
గ్రామాల్లో 4.6 శాతం.. పట్టణ ప్రాంతాల్లో 6.8 శాతం : ఎన్ఎస్ఓ పీఎల్ఎఫ్ఎస్ డేటా
న్యూఢిల్లీ : దేశంలో గ్రామీణ నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో గత నెలలో కార్మిక మార్కెట్లు ఊపందుకోలేకపోయాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన నెలవారీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) డేటా ప్రకారం సెప్టెంబరులో నిరుద్యోగ రేటు పెరిగింది. ఆగస్టులో 5.1 శాతంగా ఉన్న ఈ రేటు గత నెలలో 5.2 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను సంవత్సరాలకు పైబడిన వారిలో నిరుద్యోగ రేటు ఆగస్టులో 4.3 శాతం ఉండగా సెప్టెంబర్ నాటికి 4.6 శాతానికి పెరిగింది. జూన్ తర్వాత నిరుద్యోగ రేటు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.
పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఆగస్టులో 6.7 శాతంగా ఉన్న నిరుద్యోగం సెప్టెంబరులో 6.8 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో పురుషుల్లో నిరుద్యోగ రేటు ఐదు శాతం నుంచి 5.1 శాతానికి, మహిళల్లో 5.2 శాతం నుంచి 5.5 శాతానికి పెరిగింది. పనిచేస్తున్న లేదా పని కోసం వెతుకుతున్న వారిని సూచించే లేబర్ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్ఎఫ్పీఆర్) కూడా 55 శాతం నుంచి 55.3 శాతానికి చేరింది. 15-29 సంవత్సరాల మధ్య వయసున్న యువతలో కూడా నిరుద్యోగం 14.6 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. ఇదే వయసున్న మహిళల్లో నిరుద్యోగం 17.8 శాతం వద్ద స్థిరంగా ఉండగా పురుషుల్లో 13.5 శాతం నుంచి 13.9 శాతానికి పెరిగింది.