చివరి వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు
రాజ్కోట్: దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన మూడో అనధికారిక వన్డేలో భారత-ఎ జట్టు ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారతజట్టు 49.1 ఓవర్లలో 252పరుగులకు ఆలౌటైంది. దీంతో 73 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ వన్డేకు ముందే సిరీస్ను చేజిక్కించుకున్న టీమిండియా.. బుధవారం జరిగిన చివరి వన్డేలో ఓడినా.. సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా-ఎ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్లు లూహాన్ డ్రి ప్రిటోరియస్(123), రివాల్లో మూన్సామి(107) శతకాలతో మెరిసారు. వీరిద్దరు తొలి వికెట్కు 37 ఓవర్లలో 241 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆతర్వాత రుబిన్ హెర్మన్(11), క్వెషైల్(1), కెప్టెన్ ఆకెర్మన్(16), డియాన్ ఫార్రెస్టర్(20) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
ఆఖర్లో డెలానో పాట్గెటర్(30నాటౌట్; 15బంతుల్లో 3ఫోర్లు, సిక్సర్) ధనా ధన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 325పరుగుల భారీస్కోర్ను నమోదు చేసింది. భారత బౌలర్లు ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ రెండేసి వికెట్లతో రాణించారు. 326 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారతజట్టు ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్(25), అభిషేక్ శర్మ(11), కెప్టెన్ తిలక్ వర్మ(11), రియాన్ పరాగ్(17) స్వల్ప స్కోర్లకే పెవీలియన్కు చేరారు. ఇషాన్ కిషన్(53), ఆయుశ్ బదోని(66) అర్ధసెంచరీలతో రాణించినా.. గెలుపు తీరాలకు చేర్చలేకపోయారు. నకాబా పీటర్కు నాలుగు, మొరేకి మూడు, ఫోర్టుయిన్కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పీటర్సన్కు, సిరీస్ రుతురాజ్ గైక్వాడ్కు దక్కాయి.



