Sunday, February 8, 2026
E-PAPER
Homeజాతీయంఇస్లామాబాద్‌ పేలుళ్లులో భారత్‌, ఆఫ్గనిస్తాన్‌కు ప్రమేయం

ఇస్లామాబాద్‌ పేలుళ్లులో భారత్‌, ఆఫ్గనిస్తాన్‌కు ప్రమేయం

- Advertisement -

పాకిస్తాన్‌ ఆరోపణలు ..తిప్పికొట్టిన విదేశాంగ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ :
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ ఇటీవల చోటుచేసుకున్న ఆత్మాహుతి పేలుళ్ల దాడి ఘటనలో భారత్‌, ఆఫ్గనిస్థాన్‌కు ప్రమేయం ఉందంటూ పాకిస్తాన్‌ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. పేలుళ్ల అనంతరం పాక్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ మాట్లాడుతూ ఆత్మాహుతి దాడి వెనుక భారత్‌ పాత్ర ఉందని ఆరోపించారు. అలాగే, ఈ దాడికి అఫ్గానిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ఆరోపించారు. దాడిలో పాల్గొన్న వ్యక్తి అఫ్గానిస్థాన్‌లో తాజాగా ప్రయాణించాడని ఖవాజా పేర్కొన్నారు. అతడికి ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించారు. అంతేకాదు, దీనికి పాకిస్థాన్‌ గట్టిగా బదులిస్తుందని కూడా హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలను భారత్‌, ఆఫ్గనిస్థాన్‌ తీవ్రంగా ఖండించాయి.

పాక్‌వి కారుకూతలు : ఎంఈఏ
పాక్‌ ప్రధాని చేసిన ఆరోపణలను కారుకూతలుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ అభివర్ణించారు. పాక్‌ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోలేక భారత్‌పై నెపం నెట్టడం పసలేని చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలు అర్థరహితమని పేర్కొన్నారు. ‘ఇస్లామాబాద్‌లోని మసీదు వద్ద జరిగిన బాంబు దాడి ఖండించదగినది. ఈ ఘటనలో జరిగిన ప్రాణ నష్టానికి భారత్‌ ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది. పాక్‌ను పీడిస్తున్న సమస్యలను పరిష్కరించుకోకుండా, తమ స్వయంకత అపరాధాలకు ఇతరులను నిందిస్తూ భ్రమల్లో బతకడం దురదష్టకరం. పాక్‌ చేస్తున్న ఇలాంటి ఆరోపణలను భారత్‌ ఖండిస్తోంది. ఇవి ఎంత ఆధారరహితమైనవో, అంత అర్థరహితమైనవి కూడా” అని విదేశాంగ శాఖ పేర్కొంది.

నిరాధారం..అనాలోచితం : అఫ్గాన్‌
తమపై పాక్‌ చేసిన ఆరోపణలను ఆఫ్గనిస్థాన్‌ లోని తాలిబన్‌ ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించింది. ఇవి ఆధార రహితమైన, అనాలోచిత ఆరోపణలు అని అఫ్గాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతి నిధి ఎనాయతుల్లా ఖ్వారాజ్మీ పేర్కొన్నారు. గతంలో జరిగిన దాడులకు కూడా ఇలాగే ఆధారాలు లేకుండా ఆఫ్గానిస్థాన్‌ను నిందించారని ఆయన గుర్తు చేశారు.

ఆపరేషన్‌ విజయవంతం: బీఎల్‌ఏ
కాగా ఇస్లామాబాద్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) తమ ‘ఆపరేషన్‌ హెరోఫ్‌-2’ విజయవంత మైందని ప్రకటించింది. గత జనవరి 31 ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ ఆపరేషన్‌, ఈ నెల 6 సాయంత్రం 4 గంటల వరకు నిర్విరామంగా కొనసాగిందని పేర్కొంది. ఈ ఆరు రోజుల పోరాటంలో పాక్‌ సైన్యం, పోలీసులకు చెందిన 362 మందిని చంపేసినట్లు పేర్కొంది. 17 మంది సైనికులను బందీలుగా పట్టుకోగా, అందులో బలూచ్‌ జాతీయులైన పదిమందిని హెచ్చరించి వదిలేశామని తెలిపింది. మిగిలిన ఏడుగురికి ‘యుద్ధ నేరాల’ కింద శిక్ష విధిస్తామని పేర్కొంది. ఇదే ఆపరేషన్‌లో 50 మంది ఆత్మహుతి దళం కలిపి మొత్తం 93 మంది బిఎల్‌ఎ ఫైటర్లు ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -