వర్చువల్ ప్రసంగంలో మోడీ
న్యూఢిల్లీ : ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలను విస్తరించుకునేందుకు భారత్ అవలంబిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానానికి ఆసియాన్ సదస్సు మూల స్తంభమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ సదస్సును ఉద్దేశించి ఆయన వర్చువల్గా ప్రసంగిస్తూ భారత్, ఆసియాన్ రెండూ కేవలం వాణిజ్య భాగస్వాములు మాత్రమే కావని, అవి సాంస్కృతిక భాగస్వాములు కూడా అని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ ఆంక్షలతో ప్రపంచ దేశాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో మోడీ ఈ వ్యాఖ్య చేశారు. ‘ప్రపంచ జనాభాలో దాదాపుగా నాలుగో వంతుకు మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మనం కేవలం జనాభాను మాత్రమే పంచుకోవడం లేదు. సంస్కృతి, విలువలను కూడా… గ్లోబల్ సౌత్లో మనం భాగస్వాములం’ అని ఆయన అన్నారు.
వివిధ అంశాలపై ఆసియాన్ దేశాలు కలసికట్టుగా పనిచేయాలని మోడీ సూచించారు. ఏ విపత్తులో అయినా ఆసియాన్ స్నేహితులకు అండగా ఉంటామని చెప్పారు. అది హెచ్ఏడీఆర్ కావచ్చు…బ్లూ ఎకానమీ కావచ్చు…సముద్ర భద్రత కావచ్చు…భారత్ సహకారం వేగవంతంగా పెరుగుతోందని తెలిపారు. అందుకే తాము 2026ను ఆసియాన్-ఇండియా సముద్ర సహకార సంవత్సరంగా ప్రకటిస్తున్నామని అన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు, ప్రజల మధ్య సంబంధాలను పెంచేందుకు కలసికట్టుగా కృషి చేస్తామని చెప్పారు. సదస్సును విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంను మోడీ అభినందించారు. ’21వ శతాబ్దం మనదే. భారత్, ఆసియాన్ శతాబ్దమే. ఆసియాన్ కమ్యూనిటీ విజన్-2045, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలు మన మానవాళికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయని నేను విశ్వసిస్తున్నాను’ అని మోడీ తన వర్చువల్ సందేశంలో పేర్కొన్నారు.



