న్యూఢిల్లీ : రష్యాతో వాణిజ్యం ముఖ్యంగా గ్యాస్, చమురు రంగాల్లో వ్యాపారం చేసే దేశాలపై వంద శాతమూ సుంకాలు విధిస్తామంటూ నాటో చీఫ్ మార్క్ రూటె చేసిన బెదిరింపులను భారత్ గురువారం కొట్టిపారేసింది. ద్వంద్వ ప్రమాణాలు అనుసరించవద్దంటూ పశ్చిమ దేశాలను హెచ్చరించింది. రూటె వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణీధ్ జైస్వాల్ స్పందిస్తూ, దేశ ఇంధన అవసరాలు తీర్చడం అన్నింటికన్నా అత్యధిక ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. మార్కెట్లలో తమకు అందుబాటులో వున్నదేమిటి, అప్పటి అంతర్జాతీయ పరిస్థితులు ఏమిటీ ఇవన్నీ తమ నిర్ణయాలకు కారణాలుగా వుంటాయని పేర్కొన్నారు. ఎవరూ ద్వంద్వ ప్రమాణాలు అనుసరించినా భారత్ సహించబోదని హెచ్చరించారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా గురువారం దీనిపై స్పందించారు. రష్యన్ ఉత్పత్తులపై సెకండరీ ఆంక్షలు విధిస్తే భారత్ వాటిని కచ్చితంగా ఎదుర్కొనాల్సిన రీతిలో ఎదుర్కొంటుందని చెప్పారు. 25నుండి 40దేశాల వరకు ఏ దేశ చమురునైనా భారత్ కొనుగోలు చేస్తుంది. ఒకవేళ ఏదైనా జరిగితే, తాము ఎదుర్కొనగలమని వ్యాఖ్యానించారు.