Monday, July 14, 2025
E-PAPER
Homeఆటలుస్వల్ప ఛేదనలో భారత్‌ తడబాటు..

స్వల్ప ఛేదనలో భారత్‌ తడబాటు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ :లార్డ్స్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ (4/22) మాయ చేశాడు. మిడిల్‌ ఆర్డర్‌తో మొదలెట్టిన సుందర్‌..టెయిలెండర్లనూ పడగొట్టాడు. జశ్‌ప్రీత్‌ బుమ్రా (2/38), మహ్మద్‌ సిరాజ్‌ (2/31) సైతం మెరవటంతో ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు కుప్పకూలింది. జో రూట్‌ (40), బెన్‌ స్టోక్స్‌ (33) రాణించగా భారత్‌కు ఇంగ్లాండ్‌ 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

లక్ష్యం చిన్నదే అయినా.. ఛేదన అంత తేలిక కాదని భారత్‌కు త్వరగానే ఆర్థమైంది. ఇంగ్లాండ్‌ పేసర్లు పదునైన పేస్‌తో పరీక్షించారు. రెండో ఓవర్లోనే జైస్వాల్‌ (0)ను ఔట్‌ చేయడం ద్వారా ఆర్చర్‌ పతనాన్ని ఆరంభించాడు. ఇంగ్లిష్‌ బౌలర్లు ఇబ్బంది పెడుతున్నా రాహుల్, కరుణ్‌ నాయర్‌ (14) నిలవడంతో ఓ దశలో భారత్‌ 41/1తో కుదురుకున్నట్లే కనిపించింది. కానీ 17 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. కార్స్‌ తన వరుస ఓవర్లలో కరుణ్, గిల్‌ (6)లను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని భారత్‌ను దెబ్బతీశాడు. నాలుగో రోజు ఆఖరి ఓవర్లో నైట్‌ వాచ్‌మన్‌ ఆకాశ్‌దీప్‌ (1)ను స్టోక్స్‌ బౌల్డ్‌ చేశాడు. ఆదివారం ఇంగ్లిష్‌ పేసర్లను ఎదుర్కొని నిలవడం భారత బ్యాటర్లకు సవాలే.

ఆ ఇద్దరు మెరిసినా
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ (22), బెన్‌ డకెట్‌ (12) ఆశించిన ఆరంభం ఇవ్వలేదు. ఫామ్‌లో ఉన్న ఒలీ పోప్‌ (4) సైతం తేలిపోయాడు. మహ్మద్‌ సిరాజ్‌ ఉదయం సెషన్‌ ఆరంభంలోనే ఈ ఇద్దరిని సాగనంపాడు. జాక్‌ క్రాలీని నితీశ్‌ అవుట్‌ చేయగా ఇంగ్లాండ్‌ 50/3తో నిలిచింది. ఈ దశలో జో రూట్‌ (40), హ్యారీ బ్రూక్‌ (23) నాల్గో వికెట్‌కు 41 బంతుల్లోనే 37 పరుగులు జోడించారు. ఆకాశ్‌ దీప్‌ మెరుపు వేగంతో బ్రూక్‌ వికెట్లను గిరాటేశాడు. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (33)తో జతకలిసిన రూట్‌ ఐదో వికెట్‌కు 128 బంతుల్లో 67 పరుగులు జత చేశాడు. రూట్‌, స్టోక్స్‌ క్రీజులో ఉండగా ఇంగ్లాండ్‌ భారీ స్కోరు దిశగా సాగింది.
154/4తో నిలిచిన ఇంగ్లాండ్‌ను వాషింగ్టన్‌ సుందర్‌ కట్టడి చేశాడు. జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌ సహా విధ్వంసకర బ్యాటర్‌ జెమీ స్మిత్‌ (8)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. సుందర్‌ మాయకు చివరి 4 వికెట్లకు 11 పరుగులకే చేజార్చుకున్న ఇంగ్లాండ్‌.. ఆఖరు ఆరు వికెట్లను 38 పరుగులకే కోల్పోయింది. టెయిలెండర్లలో క్రిస్‌ వోక్స్‌ (10) ఒక్కడే రెండెంకల స్కోరు అందుకున్నాడు. బ్రైడన్‌ కార్స్‌ (1), షోయబ్‌ బషీర్‌ (2)లు పేస్‌, స్పిన్‌కు దాసోహం అయ్యారు. పరుగుల వేట గగనమైన పిచ్‌పై భారత బౌలర్లు అంచనాలను అందుకున్నారు. 192 పరుగులకే ఇంగ్లాండ్‌ను ఆలౌట్‌ చేశారు. కానీ మన బౌలర్లు క్రమశిక్షణ పాటించలేదు. ఫలితంగా, 32 పరుగులను ఎక్స్‌ట్రాల రూపంలో ఇచ్చుకున్నారు. లార్డ్స్‌ టెస్టు ఫలితంలో ఈ ఎక్స్‌ట్రాలు కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు!.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -