– శ్రీలంక జాతీయుడు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ఉచిత సత్రం కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మన దేశంలో ఆశ్రయం కోరుతూ శ్రీలంక జాతీయుడు వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ సెటిల్ అయ్యేందుకు మీకేం హక్కు ఉందని ధర్మాసనం ప్రశ్నించింది.
అసలేం జరిగిందంటే..
నిషేధిత సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ)తో సంబంధాలున్నాయని ఆరోపణలతో 2015లో శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2018లో అతడిని దోషి తేలుస్తూ పదేండ్లు శిక్ష ఖరారు చేసింది. అనంతరం ఆ వ్యక్తి మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా.. శిక్షను ఏడేండ్లకు తగ్గిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయితే, శిక్ష పూర్తి కాగానే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. దీనిపై నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను చట్టబద్ధమైన వీసాపైనే భారత్కు వచ్చానని, స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నాడు. అంతేగాక, తన భార్యాపిల్లలు ఈ దేశంలోనే సెటిల్ అయ్యారని తెలిపాడు. తనకు ఇక్కడే ఆశ్రయం కల్పించాలని కోరాడు. దీనికి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్పై అసహనం వ్యక్తం చేసింది. ”ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వాలా? ఇప్పటికే మా దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంది. అన్ని దేశాల నుంచి వచ్చే వారిని ఆదరించేందుకు భారత్ ధర్మశాల కాదు” అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక్కడ సెటిల్ అయ్యేందుకు మీకేం హక్కు ఉందని ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. శ్రీలంకలో అతడి ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. అలాగైతే మరో దేశానికి వెళ్లండని సుప్రీం కోర్టు సూచించింది.
భారత్ ధర్మసత్రం కాదు
- Advertisement -
- Advertisement -