అమెరికా వాణిజ్య ప్రతినిధి గ్రీర్
వాషింగ్టన్ : వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్ అన్ని పారిశ్రామిక వస్తువులతో పాటు చెట్ల గింజలు, వైన్స్, స్పిరిట్స్, పండ్లు, కూరగాయలు వంటి వ్యవసాయ ఆహార వస్తువులపై సుంకాలను తొలగిస్తుందని, అయితే కొన్ని వ్యవసాయోత్పత్తులకు రక్షణలను నిలుపుకుంటుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి జమైసన్ గ్రీర్ తెలిపారు. ఒప్పందం ఇంకా కాగితాలకే పరిమితమై ఉన్నప్పటికీ దాని ప్రత్యేకతలు, వివరాలు తమకు తెలుసునని అన్నారు. రసాయనాలు, వైద్య పరికరాలపై భారత్ సుంకాలను తగ్గిస్తుందని, ట్రంప్ తెలిపిన విధంగా అమెరికా 18 శాతం సుంకాలను కొనసాగిస్తుందని చెప్పారు. సాంకేతిక సుంకేతర అవరోధాలను తగ్గించడంలో భాగంగా కొన్ని అమెరికా ప్రమాణాలను గుర్తించేందుకు భారత్ ఓ ప్రక్రియను అవలంబిస్తుందని గ్రీర్ తెలిపారు. రష్యాకు బదులుగా వెనిజులా, గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువ ముడి చమురును పొందడానికి భారత్కు ఎన్నో అవకాశాలు ఉన్నాయని గ్రీర్ చెప్పారు.
ఈ ఒప్పందం రెండు దేశాలకూ ఉత్తేజకరమైన అవకాశమని ఆయన వ్యాఖ్యానించారు. ‘మేము భారత్పై ఒకస్థాయిలో…అంటే 18 శాతం సుంకాన్ని కొనసాగిస్తాం. ఎందుకంటే వారితో మాకు భారీ వాణిజ్య లోటు ఉంది. కానీ వారు కూడా మా కోసం వివిధ రకాలైన వ్యవసాయ ఉత్పత్తులు, తయారీ వస్తువులు, రసాయనాలు, వైద్య పరికరాలు తదితరాలపై సుంకాలను తగ్గించడానికి అంగీకరించారు’ అని వివరించారు. ట్రంప్ చెప్పినట్లు ఏయే వస్తువులపై భారత్ సుంకాలు ‘జీరో’ స్థాయికి చేరతాయని ప్రశ్నించగా పారిశ్రామిక వస్తువులపై 98శాతం నుంచి 99శాతం వరకూ సుంకా లు తగ్గుతాయని బదులిచ్చారు. వ్యవసాయానికి సంబంధించి అనేక వస్తువులపై సుంకాలు తగ్గుతాయని గ్రీర్ చెప్పారు. ‘అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నింటిలోనూ కొన్ని కీలక రంగాలకు రక్షణలు ఉంటాయి. కాబట్టి భారత్ వాటిని కొనసాగిస్తూనే ఉంటుంది. మేమేమో ఆయా రంగాలలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటాం. అయితే చెట్ల గింజలు, వైన్స్, స్పిరిట్స్, పండ్లు, కూరగాయలు వంటి వాటిపై సుంకాలు తగ్గుతాయి’ అని గ్రీర్ తెలిపారు.



