ట్రంప్ అధిక టారిఫ్ల ప్రభావం
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ విధించిన అధిక టారిఫ్లు భారత ఇంజనీరింగ్ ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీయనున్నాయి. ఈ సుంకాలతో భారతదేశం నుంచి అమెరికాకు చేసే ఇంజనీరింగ్ ఎగుమతులు 7.5 నుండి 8 బిలియన్ డాలర్ల మేర తగ్గుముఖం పట్టనున్నాయని అంచనా. భారత కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.70వేల కోట్లు కావడం తీవ్ర ఆందోళనకరం. ”ట్రంప్ అధిక సుంకాలతో ఇప్పటికే వ్యాపారం 50 శాతం తగ్గింది. పూర్తి టారిఫ్ ప్రభావం అమలులోకి రాకముందే ముందస్తుగా పంపిన ఎగుమతుల తర్వాత కొత్త ఆర్డర్లు నిలిచిపోయాయి.” అని ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఇఇపిసి) ఛైర్మన్ పంకజ్ చద్దా తెలిపారు. ఆర్థిక సంవత్సరం 2024-25లో అమెరికాకు 20 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.75 లక్షల కోట్ల) ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందులో 5 బిలియన్ డాలర్లు స్టీల్, అల్యూమినియం సంబంధిత ఉత్పత్తులు, 2.6 బిలియన్ డాలర్లు ఆటో రంగం ఎగుమతుల నుండి, మిగిలిన 12.5 బిలియన్ డాలర్లు ఇతర ఇంజనీరింగ్ వస్తువుల నుండి నమోదయ్యాయి. ఈ రంగం భారత సరుకు ఎగుమతులలో అత్యంత ముఖ్యమైందిగా ఉంది. మొత్తం ఎగుమతులలో నాలుగో వంతు కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. స్టీల్, అల్యూమినియం ఎగుమతులు 20 శాతం పడిపోవచ్చని అంచనా వేశారు. 12.5 బిలియన్ డాలర్ల విలువైన ఇతర ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతుల్లో ప్రధాన సవాల్ నెలకొని ఉంది. వీటిలో 50 శాతం పడిపోవచ్చని పరిశ్రమ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి.
భారత ఇంజినీరింగ్ ఎగుమతులకు రూ.70వేల కోట్ల నష్టం
- Advertisement -
- Advertisement -