Saturday, May 31, 2025
E-PAPER
Homeబీజినెస్భారత వృద్ధి 6.5 శాతమే..

భారత వృద్ధి 6.5 శాతమే..

- Advertisement -

– టారిఫ్‌లతో మార్కెట్లలో ఆస్థిరత
– పెరిగిన బంగారం నిల్వలు
– ఆరేండ్ల గరిష్టానికి నకిలీ నోట్లు
– ఆర్బీఐ వార్షిక నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండొచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అంచనా వేసింది. దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ఆర్‌బిఐ వార్షిక రిపోర్ట్‌ 2024-25లో వెల్లడించింది. మార్కెట్‌ అస్థిరతలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య ఆందోళనలు, సరఫరా గొలుసుల అంతరాయాలు, వాతావరణ ప్రేరిత అనిశ్చితులు తదితర అంశాలు ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. అయినప్పటికీ 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ దృక్పతం ఆశాజనకంగానే ఉందని పేర్కొంది. ఆర్బీఐ రిపోర్ట్‌ వివరాలు.. 2024-25లో దేశంలో అనేక ఆర్ధిక ఒడిదుడు కులు ఎదురైనప్పటికీ.. ఆర్ధిక వ్యవస్థ బలంగానే ఉంది. 2025-26లో వ్యవసాయ రంగానికి సానుకూల అవకాశాలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటంతో పాటు ఉత్పాదకతను పెంచే ప్రభుత్వ విధానాలు ఈ రంగానికి మద్దతును అందించనున్నా యి. టారిఫ్‌ విధాన పరిణామాలు ఆర్థిక మార్కెట్లలో అప్పుడప్పుడు అస్థిరతలకు దారితీయవచ్చు. నేషనల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ మిషన్‌, మేక్‌ ఇన్‌ ఇండియా వంటివి తయారీ రంగాన్ని బలపర్చడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
విదేశీ మారకం నిల్వలు రూ.57 లక్షల కోట్లు
గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో రిజర్వ్‌ బ్యాంక్‌ రికార్డ్‌ స్థాయిలో 57 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా ద్వారా మొత్తం పసిడి 879.58 టన్నులకు చేరింది. ఇంతక్రితం ఏడాది 822.10 టన్నులుగా ఉంది. విలువ పరంగా 2024 మార్చి ముగింపు నాటికి రూ.2,74,714 కోట్ల విలువ చేసే బంగారం ఉండగా.. 2025 మార్చి 31నాటికి 57 శాతం పెరుగుదలతో రూ.4,31,625 కోట్లకు పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల, అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడమే ఇందుకు కారణం. 2024-25లో ఆర్బీఐ బ్యాలెన్ష్‌ షీట్‌ 8.2 శాతం పెరిగి రూ.70.47 లక్షల కోట్ల నుంచి రూ.76.25 లక్షల కోట్లకు చేరింది. దేశీయ, విదేశీ పెట్టుబడుల పెరుగుదలతో పాటు బంగారం నిల్వలు వేగంగా పెరగడమే ఇందుకు కారణం. ఆర్బీఐ మొత్తం ఆస్తులలో ప్రభుత్వ బాండ్ల లాంటి దేశీయ ఆస్తులు 25.73 శాతం ఉండగా, 74.27 శాతం విదేశీ కరెన్సీ, బంగారం, ఇతర విదేశీ పెట్టుబడులు ఉన్నాయి. మొత్తం విదేశీ మారక నిల్వలు 5.95 శాతం పెరిగి రూ.57.12 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
పెరిగిన నకిలీ నోట్లు
2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నోట్ల ముద్రణ వ్యయం వార్షిక ప్రాతిపదికన దాదాపు 25 శాతం పెరిగి రూ.6,373 కోట్లకు చేరకుంది. ఇంతక్రితం ఏడాది 2023-24లో ఇది రూ.5,101 కోట్లుగా ఉంది. రూ.500 బ్యాంకు నోట్ల వాటా 86 శాతంగా ఉంది. నకిలీ నోట్లకు సంబంధించి 2024-25లో బ్యాంకింగ్‌ రంగంలో మొత్తం కరెన్సీలో నకిలీ నోట్లు 4.7 శాతం ఉన్నట్టు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. గత సంవత్సరంతో పోలిస్తే రూ.200, రూ.500 డినామినేషన్ల నకిలీ నోట్లు వరుసగా 13.9 శాతం, 37.3 శాతం పెరిగాయి. 2024-25లో 1.18 లక్షల రూ.500 నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. ఇంతక్రితం ఏడాది ఈ సంఖ్య 85,711 నోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.100కు సంబంధించిన 51,069 నకిలీ నోట్లు గుర్తించబడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -