Saturday, May 31, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుభారత సార్వభౌమాధికారం ట్రంప్‌నకు తాకట్టు

భారత సార్వభౌమాధికారం ట్రంప్‌నకు తాకట్టు

- Advertisement -

– మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో కాంగ్రెస్‌ జైహింద్‌ ర్యాలీ
– అమెరికా అధ్యక్షుడి కాల్పుల విరమణ ప్రకటన దేశానికి అవమానకరం
– దేశ భద్రత విషయంలో కాంగ్రెస్‌ ఏనాడూ రాజీ పడలేదు : సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ-నిజాంపేట్‌

పాకిస్తాన్‌తో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్నది సీజ్‌ ఫైర్‌ కాదని.. అది భారత సార్వభౌమాధికారాన్ని ట్రంప్‌నకు తాకట్టు పెట్టడమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని విజ్ఞాన్‌ జ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి కేజీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ వరకు గురువారం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన జైహింద్‌ ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాలను చేతపట్టి ముందుకు సాగారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పహల్గాం ఘటన జరగ్గానే అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి మద్దతు కోరిందని, కానీ.. నాలుగు రోజుల యుద్ధం అనంతరం ఏ ఒక్కరికీ చెప్పకుండానే సీజ్‌ ఫైర్‌కు ఒప్పుకొని భారత సార్వభౌమాధికారాన్ని ట్రంప్‌నకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. అఖిలపక్ష సమావేశంలో దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు కేంద్రానికి బాసటగా నిలిచాయని గుర్తు చేశారు. అయితే భారత్‌, పాకిస్తాన్‌ల సీజ్‌ ఫైర్‌ విషయమై అమెరికా అధ్యక్షులు ప్రకటన చేయడం దేశానికి అవమానకరమన్నారు. దేశ భద్రతను కాపాడటంలో కేంద్ర ఎన్‌డీఏ ప్రభుత్వం విఫలమైందన్నారు. పహల్గాం దాడి విషయంలో దేశంలోని ప్రధాన పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి బాసటగా నిలిచినా.. అమెరికా ఒత్తిళ్లకు తలవంచి సీజ్‌ ఫైర్‌కు అంగీకరించడం దారుణం అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో అమెరికా ఆమెపై ఎంత ఒత్తిడి తెచ్చినా లెక్క చేయకుండా పాకిస్తాన్‌తో యుద్ధం చేసి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
పాకిస్తాన్‌తో జరిగిన నాలుగు రోజుల యుద్ధంలో భారత్‌కు చెందిన ఎన్ని యుద్ధ విమానాలు నేల కూలాయో ఇప్పటికీ స్పష్టతనివ్వకపోవడం దారుణ మన్నారు. బీజేపీ పాలనలో దేశ భద్రత డొల్లగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శత్రుదేశంపై యుద్ధం చేయడం చేతకాక కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీపై బీజేపీ విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. దేశ భద్రత విష యంలో కాంగ్రెస్‌ ఏనాడూ రాజీ పడలేదని వివరించారు. పహల్గాం ఘటనలో 26 మంది అమాయక టూరిస్టులు అసువులు బాసినా బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్‌పై ప్రతి దాడి చేయ డంలో విఫలమైందన్నారు. అంతకు ముందు జరిగిన గాల్వాన్‌ ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు వీర మరణం పొందారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ వాలకం ”బుద్ధి లేనోడికి సద్ది కడితే బొడ్రాయి దగ్గరికెళ్లి తిని పడుకున్నట్టు” ఉందని విమర్శించారు. ఈ నాలుగు రోజుల యుద్ధంలో విరోచితంగా పోరాడిన భారత సైన్యానికి సంఘీభావంగా తాము ఏఐసీసీ పిలుపు మేరకు జై హింద్‌ ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు.
అంతకు ముందు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షులు బి.మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ సాయుధ దళాల విభాగం చైర్మెన్‌ రోహిత్‌ చౌదరి ప్రసంగించారు. కాంగ్రెస్‌ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజయశాంతి, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, మధుయాష్కి, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, కూన శ్రీశైలంగౌడ్‌, కాంగ్రెస్‌ కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలను హనుమంత రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూపతిరెడ్డి, నిజాంపేట్‌ కార్పొరేషన్‌ అధ్యక్షులు కొలను రాజశేఖర్‌ రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ నేతలు, ఎన్‌ఎస్‌యూఐ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -