నవతెలంగాణ-హైదరాబాద్ : విమానాల్లో సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత పదిరోజులుగా ఎయిర్ ఇండియా సహా పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా చెన్నై నుంచి మధురైకి బయల్దేరిన ఇండిగో విమానంలో టెక్నికల్ సమస్యలు బయటపడ్డాయి.
విమానం 68 మంది ప్రయాణికులతో శుక్రవారం ఉదయం 6:44 గంటల సమయంలో చెన్నై నుంచి మధురైకి బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత సాంకేతిక సమస్య తెల్తింది. అప్రమత్తమైన పైలట్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విమానాన్ని తిరిగి చెన్నైకి మళ్లించేందుకు అనుమతి కోరాడు. తిరిగి ఉదయం 7:17 గంటలకు విమానం చెన్నై ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అందులోని ప్రయాణికులను కిందకుదించి.. సమస్యను పరిష్కరిస్తున్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై ఇండిగో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.