– ఇప్పటి వరకు రూ.68 కోట్ల నగదు చెల్లించాం
– లబ్దిదారులతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో దాదాపు 250 మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతోందనీ, లబ్దిదారులకు ఇప్పటి వరకు రూ.68 కోట్ల నిధులను విడుదల చేసినట్టు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్దిదారులతో మంత్రి మాట్లాడారు. నిర్మాణపరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల నిర్మాణం, బిల్లుల విషయంలో అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని పలువురు లబ్దిదారులు మంత్రికి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను సాకారం చేసేందుకే కాంగ్రెస్ సర్కార్ ఈ పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 47,335 ఇండ్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 7,824 బేస్మెంట్, 895 గోడల నిర్మాణం, 64 ఇండ్లు శ్లాబ్ల వరకు పూర్తయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నా, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సోమవారం లబ్దిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే నిధులను జమచేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ ఉంటుందే తప్ప నిర్మాణ బాధ్యతలను చేపట్టడం లేదని పేర్కొన్నారు. స్ధలానికి అనుగుణంగా లబ్దిదారులు తమకు నచ్చిన రీతిలో 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకునే సౌలభ్యాన్ని కల్పించినట్టు చెప్పారు. నిర్మాణ పనుల్లో లబ్దిదారులకు ఇంజనీర్లు తగిన సహకారాన్ని అందించాలనీ, వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా వారిని ప్రోత్సహించాలని మంత్రి పొంగులేటి సూచించారు.
250 మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES