Saturday, June 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇక పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు

ఇక పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు

- Advertisement -

– పేదలు ఉన్న చోటే జీ ప్లస్‌ 3 పద్ధతిలో ఇండ్ల నిర్మాణం
– గిరిజనులకు ప్రత్యేకంగా 22 వేల ఇండ్లు : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఇక నుంచి పట్టణాల్లోనూ చేపడతామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణాల్లోని మురికి వాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. హైదరాబాద్‌కు దూరంగా గతంలో 42 వేల ఇండ్లను నిర్మించామనీ, సుమారు 19 వేల మంది మాత్రమే అక్కడికి వెళ్లారని తెలిపారు. ఇటీవల క్షేత్రస్ధాయిలో మరోసారి పరిశీలన చేయడం ద్వారా కేవలం 13 వేలమంది మాత్రమే అక్కడ నివాసం ఉంటున్నట్టు తేలిందని చెప్పారు. ఈ క్రమంలో పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా హైదరాబాద్‌ నగరంలోని మురికి వాడల్లో పేదలు ఉన్నచోటే జీ ప్లస్‌ 3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా తొలివిడతలో హైదరాబాద్‌లో 16 మురికివాడలను గుర్తించామనీ, అలాగే వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, కరీంనగర్‌ తదితర పట్టణాలలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం, మున్ననూరు నాలుగు ఐటీడీఏ పరిధిలో గల చెంచు, కొలం, తోటి, కొండరెడ్లకు 13,266 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని వివరించారు. రాష్ట్రంలోని 16 ఎస్టీ నియోజకవర్గాలకు ఇప్పటికే 8,750 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇంతవరకు 22,016 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. వీటికి వెంటనే లబ్దిదారులను గుర్తించి ఇండ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇండ్ల నిర్మాణం జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదల ఇంటి కోసం ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ లక్ష్యమనీ, దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం పని చేయాలని మంత్రి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -