Sunday, June 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనీటిపారుదల శాఖలో సమాచారం లీక్‌

నీటిపారుదల శాఖలో సమాచారం లీక్‌

- Advertisement -

కాళేశ్వరం ఫైళ్లు బీఆర్‌ఎస్‌కు అందాయా !
మేడిగడ్డ ఏడో బ్లాక్‌కు గ్రౌటింగ్‌పైనా డౌట్‌
నూనె శ్రీధర్‌పై చర్యలను అడ్డగింత
ఈఎన్సీ అనిల్‌కుమార్‌ పాత్రపై అనుమానాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు అనేక సంచలనాలకు కారణభూతమవుతున్నది. అవినీతి, అక్రమాల మూలంగా ఉపయోగంలోకి రాని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రూ. 85 వేల కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు. ఇంకా ఖర్చు చేయకపోతే ప్రాజెక్టు పూర్తికాదు. ఈ ప్రాజెక్టు విషయంలోనే ఇటీవల 38 మంది ఇంజినీర్లకు షోకాజ్‌ నోటీసులు సైతం ఇచ్చారు. అదే సందర్భంలో ప్రాజెక్టును కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎన్డీఎస్‌ఏ పలు సలహాలు, సూచనలు ఇచ్చింది. అందులో కూడా మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు సమాచారం. బ్యారేజీల రక్షణ చర్యల్లో చెప్పనవి కూడా చేశారనీ, విజిలెన్స్‌, ఏసీబీ కేసులకు సంబంధించిన సమాచారం నీటి పారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధ నుంచి లీక్‌ అయ్యిందనే ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. సమాచారం, ఫైళ్లు గత ప్రభుత్వ పాలకులైన బీఆర్‌ఎస్‌ కీలక నేతలకు చేరాయనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ చేస్తున్న రాజకీయ విమర్శల వెనుక నీటిపారుదల శాఖ నుంచి సమాచారం లీక్‌ కావడమే ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజిలెన్స్‌ నివేదికతోపాటు తాజాగా నీటిపారుదల శాఖలో ఈఈ గా పనిచేస్తున్న నూనె శ్రీధర్‌పై ఏసీబీ కేసు విషయానికి సంబంధించి కూడా జలసౌధలో గూడుపుఠాణి జరిగిందని అంటున్నారు. నూనె శ్రీధర్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యల అమలులో ఈఎన్సీ జనరల్‌ జి అనిల్‌కుమార్‌ అలక్ష్యం చేశారనీ, అడ్డుకున్నారనే ప్రచారం ఉంది. అంతేగాక ఏసీబీ కేసు విషయంలోనూ ఆయన మెతకగా వ్యవహరించారనీ, దీంతో నూనె శ్రీధర్‌కు, ఈఎన్సీ అనిల్‌కుమార్‌కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈనేపథ్యంలోనే అనిల్‌కుమార్‌ను తక్షణం ఈఎన్సీ జనరల్‌ పోస్టు నుంచి రిలీవ్‌ చేసి సర్కారు దగ్గర రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈఎన్సీ అడ్మిన్‌ అమ్జాద్‌ హుస్సేన్‌కు ఈఎన్సీ జనరల్‌ బాధ్యతలను అప్పగించింది. ఏకంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖలు సైతం బీఆర్‌ఎస్‌ నాయకత్వానికి చేరడం వెనుక అనిల్‌కుమార్‌ హస్తం ఉందనే అనుమానాలు సర్కారులో ఉన్నాయి. మేడిగడ్డ ఏడో బ్లాక్‌కు గ్రౌటింగ్‌ చేయడం కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇవి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకే జరిగిందనీ, ప్రభుత్వంలో ఉండి సర్కారు చెప్పినట్టుగా కాకుండా ప్రతిపక్ష నేత ఆదేశాలను ఎలా అమలుచేస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక రాకముందే గ్రౌటింగ్‌ చేయడంతో గత వర్షాకాలంలో బ్యారేజీలు కొంతమేర ఆగాయి. అది చేయకపోతే వరదలకు కచ్చితంగా ప్రాజెక్టు కొట్టుకుపోయి ఉండేదని సమాచారం. అదే జరిగితే బీఆర్‌ఎస్‌ ప్రజల్లో పలుచన అయ్యేది. ఈ మొత్తం వ్యవహారానికి అనిల్‌కుమార్‌ వైఖరి కూడా కారణమని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అనిల్‌కుమార్‌పై తీవ్ర చర్యలకు ప్రభుత్వం పూనుకుందనే ప్రచారం జలసౌధలో జరుగుతున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -