నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జూన్ 7 పవిత్ర బక్రీద్ పండుగ ఉన్నందున ఈద్గాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టరు హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రోజు మినీ మీటింగ్ హాలులో బక్రీద్ పండుగ పురస్కరించుకొని శాంతి సంఘ సమావేశం జిల్లా కలెక్టరు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా మత పెద్దలు చేసిన సూచనలు, సలహాలను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. నమాజ్ వేళలో కరెంటు ఉండేలా చూడాలన్నారు. కరెంట్, మంచినీరు వంటి మౌలిక సౌకర్యాలు ఏర్పాటుచేయాలన్నారు.మసీదుల వద్ద పఠిష్టమైన పారిశద్య చర్యలు చేపట్టాలని, చెత్త బండ్లు అందుబాటులో ఉంచాలని, చెడు వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇంటింటికి వేస్టేజ్ కవర్లు పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.మంచినీరు సౌకర్యం కల్పించాలని, వీధి దీపాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ముఖ్యంగా ప్రార్ధనా సమయాలలో విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఆదేశించారు.
వార్డులలో మంచినీరు సమయానికి వచ్చే లా చూడాలన్నారు. మంచి నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పశువులను తరలించడానికి, వాటిని వధించడానికి ముందు తప్పనిసరిగా పశు వైద్యాధికారిచే ధ్రువీకరణ పొందాలని అన్నారు. బక్రీద్ పండుగ దృష్ట్యా వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని ఫిర్యాదులు వచ్చిన వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి శాంతిభద్రతల సమస్యలు పరిష్కరించాలన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద రెవెన్యూ పోలీస్ వెటర్నరీ అధికారులు నిరంతరం నిగా ఉండేలా పర్యవేక్షణ జరపాలన్నారు.ఎలాంటి అవాంఛనీ య సంఘటన జరగకుండా,సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగకు జరుపుకోవాలని తెలిపారు. పండగ దృష్టిలో పెట్టు కొని అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈద్గాల వద్ద మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని వైద్యశాఖ అధికారిని ఆదేశించారు. మతసామరస్యానికి ప్రతీక గా జిల్లాను నిలపాలన్నారు.
డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ పవిత్ర బక్రీద్ పండుగ ఉన్నందున మసీదుల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తామని, బక్రీద్ పండుగ రోజులలో పూర్తి బందోబస్తు ఉంటుందని, ప్రతి రోజు పెట్రోలింగ్ నిర్వహిస్తామని, సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తామని అందరి సహకారంతో సామరస్య వాతావరణంలో బక్రీద్ పండగను నిర్వహించుకోవాలని అన్నారు.బక్రీద్ పండుగ రోజున మసీదుల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఏసిపి లక్ష్మీనారాయణ, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, డిపిఓ సునంద, జిల్లా పశు వైద్య శాఖ అధికారి యాదయ్య, మత పెద్దలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.