- Advertisement -
- – ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు..
– కొత్తగా 9,600 సీట్లు అందుబాటులోకి .. - నవతెలంగాణ – జుక్కల్
- రాష్ట్రంలో మరో 120 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 495 కేజీబీవీలు ఉండగా… వాటిల్లో 283 చోట్ల ఆరు నుంచి ఇంటర్ వరకు విద్య అందిస్తున్నారు. మిగిలిన 212 కేజీబీవీల్లో 120 చోట్ల ఇంటర్ వరకు విద్య అందించేలా ఉన్నతీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతోనే వాటిని నడపనుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని 60 శాతం వాటా నిధులు అడగాలని భావిస్తోంది. ప్రస్తుతం 283 కేజీబీవీల్లో 26 వేల మంది అమ్మాయిలు ఇంటర్ చదువుతున్నారు. ఈ విద్యాలయాలు పూర్తి రెసిడెన్షియల్ విధానంలో… పాఠశాల విద్యాశాఖ పర్యవేక్షణలో నడుస్తాయి.
ఒక్కో విద్యాలయంలో రెండు ఇంటర్ గ్రూపులు: ఇప్పటివరకు ఇంటర్ బోధిస్తున్న కేజీబీవీల్లో రెండు చొప్పున గ్రూపులను మాత్రమే ప్రవేశపెట్టారు. ఒక్కో గ్రూపులో 40 సీట్లు చొప్పున ఫస్టియర్లో 80 సీట్లుంటాయి. అంటే 283 కేజీబీవీల్లో 22,640 సీట్లున్నాయి. కొత్తగా ఈ సంవత్సరం 120 కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తుండటంతో మరో 9,600 సీట్లు అదనంగా రానున్నాయి. వీటికి ఇంటర్బోర్డు నుంచి కళాశాల కోడ్ సైతం వచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. త్వరలో అనుబంధ గుర్తింపు కోసం బోర్డుకు అఫిలియేషన్ ఫీజు చెల్లించనున్నారు. ఈ 120 కేజీబీవీల్లో ఇంటర్ బోధన ప్రవేశపెడుతున్న విషయాన్ని విద్యాశాఖ బహిర్గతం చేయకపోవడం గమనార్హం. దానివల్ల పేద విద్యార్థులకు సమాచారం లేక ప్రైవేట్ కళాశాలల్లో చేరే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
- Advertisement -