పరీక్షా కేంద్రంలో అన్ని మౌలిక వసతుల ఏర్పాటు పూర్తి
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అరగకుటి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 25 ఫిబ్రవరి 2026 నుండి మార్చి 16, 2026 వరకు నిర్వహించనున్నట్లు నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆరికూటి శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. ఈ పరీక్షలకు నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల, నెల్లికుదురు మోడల్ స్కూల్, నర్సింహులపేట మోడల్ స్కూల్, కేజీబీవీ ల నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులు 300, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 348 మొత్తం 648 మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఆయన వెల్లడించారు.
పరీక్షల నిర్వహణను సజావుగా, ప్రశాంత వాతావరణంలో చేపట్టేందుకు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఉదయం 8 గంటల లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 8:30 గంటల నుండి పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారని స్పష్టం చేశారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అవసరమైన అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.



