– రెండు గ్రూపుల మధ్య మాటల యుద్ధం
– పోలీసుల జోక్యం, హెచ్చరికలతో వెనక్కి తగ్గిన సంజీవరెడ్డి గ్రూపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మీడియా ప్రతినిధుల సాక్షిగా ఐఎన్టీయూసీ నేతలు సంజీవరెడ్డి, అంబటి కృష్ణమూర్తి గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. ఒకరినొకరు తోసేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. మీదే దొంగ సంఘం..మీదే దొంగ సంఘం అంటూ ప్రత్యారోపణలు చేసుకున్నారు. అక్కడున్నవారు వారించేందుకు యత్నించినా సంజీవరెడ్డి గ్రూపు వెనక్కి తగ్గలేదు. అంబటి కృష్ణమూర్తికి ఐఎన్టీయూసీతో సంబంధం లేదని వారించింది. ‘యూనియన్ విభేదాలుంటే బయట చూసుకోవాలి. ప్రెస్మీట్ అడ్డుకోవడం సబబు కాదు’ అని మీడియా ప్రతినిధులు వారించడంతో సంజీవరెడ్డి గ్రూపు వాళ్లు కాస్త వెనక్కి తగ్గి కిందకు వెళ్లారు. ఆ తర్వాత అంబటి కృష్ణమూర్తి ప్రెస్మీట్ ప్రారంభించే సమయంలో సంజీవరెడ్డి గ్రూపునకు చెందిన ఆర్డీ చంద్రశేఖర్ నేతృత్వంలో ఐఎన్టీయూసీ నాయకులు మళ్లీపైకి వచ్చారు. ఆబిడ్స్ పోలీసులు వారించినా వినకుండా అక్కడే బైటాయించారు. ఐఎన్టీయూసీ కండువాలు, బ్యానర్ తీసేసి ప్రెస్మీట్ పెట్టుకుంటే తమకేమీ అభ్యంతరం లేదనీ, తమ యూనియన్ అధికారిక చిహ్నాలను వారు ఎలా వాడుకుంటారని ఆర్డీ. చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎన్టీయూసీ పేరుతో ప్రెస్మీట్ పెట్టకుండా అడ్డుకోవాలని తాము డీజీపీ జితేందర్కు వినతిపత్రం కూడా అందజేశామని సీఐకి చూపెట్టారు. బ్యానర్ తీసేసే వరకూ కదలబోమని పట్టుబట్టారు. దీంతో సీఐ జోక్యం చేసుకుని బ్యానర్ తీసేసి ప్రెస్మీట్ పెట్టాలని అంబటి కృష్ణమూర్తి గ్రూపునకు సూచించారు. తామెందుకు తీసేయాలనీ, పదిమందిని వెంటేసుకుని వచ్చి ప్రెస్మీట్ను అడ్డుకోవడమేంటి అని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరు గ్రూపుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణతో మాటలయుద్ధం తీవ్రమవుతుండంతో సీఐ ఇరు గ్రూపులను వారించారు. ఏమైనా ఉంటే కేసు పెట్టాలి తప్ప ఇలా వ్యవహరించడం తగదంటూ హెచ్చరించారు. సంజీవరెడ్డి గ్రూపు వాళ్లను అక్కడ నుంచి పంపారు. ఇరు గ్రూపుల వాళ్లు ఒకరిపైఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
రౌడీ మూకలు మా ప్రెస్మీట్ను అడ్డుకోవాలని చూడటం దుర్మార్గం
సంజీవరెడ్డి గ్రూపునకు చెందిన కొందరు రౌడీమూకలు వచ్చి తమ ప్రెస్మీట్ను అడ్డుకోవాలని చూడటం దారుణమని ఐఎన్టీయూసీ(ఆర్) జాతీయ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ…ఇక్కడ ప్రెస్మీట్లు పెట్టుకుని తమ భావాలను వ్యక్తపరిచే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. మీడియా ప్రతినిధులు వారిస్తున్నా ప్రెస్మీట్ అడ్డుకోవాలని చూడటం దారుణమన్నారు. దీనిపై డీజీపీ ఫిర్యాదు చేస్తామన్నారు. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షునిగా సంజీవరెడ్డి ఎన్నిక చెల్లదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాఫీలను మీడియాకు చూపెట్టారు. తాను అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నానని ఆర్డీ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. సమావేశంలో అయిలయ్యగౌడ్, బాదాల అమర్బాబు, నాగరాజు, భాస్కర్, అరుణ, తదితరులు పాల్గొన్నారు.
అంబటి కృష్ణమూర్తి