Tuesday, September 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి

ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి

- Advertisement -

టీజీ – ఐపాస్‌ ద్వారా 15 రోజుల్లోనే అనుమతులు : ఇటలీ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ హబ్‌గా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇటలీ పారిశ్రామికవేత్తలను కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో ఆ దేశానికి చెందిన ప్రముఖ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పరిశ్రమల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. కాంపోనెంట్‌ తయారీ, సప్లై చైన్‌, మెయింటెనెన్స్‌, రిపేర్‌ అండ్‌ ఓవర్‌హాల్‌(ఎమ్మార్వో), అవియానిక్స్‌, రాడార్‌ అండ్‌ సెన్సార్‌ సిస్టమ్స్‌, న్యూ-స్పేస్‌ అండ్‌ చిన్న ఉపగ్రహాలు, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ అండ్‌ కంపోజిట్స్‌ తయారీలో తెలంగాణలో ఉన్న అవకాశాలు, అనుకూలతలను మంత్రి వారికి వివరించారు. ‘రాష్ట్రంలో ప్రత్యేక ఏరోస్పేస్‌ పార్కులు, సెజ్‌లు, భారీ ఎంఎస్‌ఎంఈ నెట్‌వర్క్‌, శక్తిమంతమైన ఆర్‌ అండ్‌ డీ, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అత్యుత్తమ ప్రతిభ గల మానవ వనరులు, సుస్థిర ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం, పారిశ్రామిక ప్రోత్సాహాక విధానాలతో కూడిన పటిష్టమైన ఎకో సిస్టమ్‌ అందుబాటులో ఉంది.

దేశంలో ఎక్కడా లేని విధంగా టీజీ – ఐపాస్‌ ద్వారా 15 రోజుల్లోనే వేగంగా అనుమతులు ఇస్తున్నాం’ అని చెప్పారు. హైదరాబాద్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌, డీఆర్‌ డీవో లాంటి కేంద్ర సంస్థలు, టాటా అడ్వాన్స్డ్‌ సిస్టమ్స్‌, ధ్రువ స్పేస్‌, స్కైరూట్‌ స్పేస్‌, బోయింగ్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌, జీఈ ఏవియేషన్‌, ప్రాట్‌ విట్నీ లాంటి దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ బ్రాండ్‌ ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయని వారికి వివరించారు. హై ప్రెసిషన్‌ మెషినింగ్‌, షీట్‌ మెటల్‌, హైడ్రాలిక్‌ సిస్టమ్స్‌ వంటి క్లిష్టమైన భాగాలను తయారీ చేసి, అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేయొచ్చని తెలిపారు. విమానాలు, హెలికాప్టర్ల ఇంజిన్ల నిర్వహణలో ఇటలీకి ఉన్న నైపుణ్యం ఇక్కడి డిఫెన్స్‌, ప్రయివేట్‌ రంగాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అవియానిక్స్‌, రాడార్‌ సెన్సార్‌ సిస్టమ్స్‌లో ఇటలీ కంపెనీలకు అపార అనుభవం ఉంది.

ఈ రంగానికి చెందిన వస్తువులను ఇక్కడ ఉత్పత్తి చేస్తే దేశ రక్షణ రంగం అవసరాలు తీరడంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేయోచ్చు’ అని అన్నారు. ధ్రువా స్పేస్‌, అనంత్‌ టెక్నాలజీస్‌, స్కైరూట్‌ వంటి హైదరాబాద్‌ స్టార్టప్‌లు ఇప్పటికే తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాయని గుర్తు చేశారు. ‘తెలంగాణ, ఇటలీ’ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రత్యేక కార్యదర్శి సంజరు కుమార్‌, డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ పీఏ, కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇటలీ ఇన్‌ బెంగళూరు జియాన్‌డొమెనికో మిలానో, ట్రేడ్‌ కమిషనర్‌ అంటోనియెట్టా బక్కానారి, ఇండిస్టియల్‌ ఇంటర్నేషనలైజేషన్‌, నేషనల్‌ ఎకానమీ మిషన్స్‌ సెక్షన్‌ హెడ్‌ సిల్వియా సిక్కారెల్లి, ప్రెసిడెన్సీ ఆఫ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ లూగి రిగ్గియో, మల్టీ లేటరల్‌ సైంటిఫిక్‌ డిప్లోమసీ హెడ్‌ అలెశాండ్రో గార్బెల్లిని, వాన్‌జెట్టి ఇంజనీరింగ్‌, ఎస్‌ఆర్‌ఎల్‌, లియోనార్డోతో పాటు వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -