Saturday, September 20, 2025
E-PAPER
Homeజాతీయంతెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

- Advertisement -

వారికి మద్దతు, భద్రతనిస్తాం
భవిష్యత్‌ తరాలకు అవకాశాలను సృష్టిస్తాం : పీఏఎఫ్‌ఐ 12వ వార్షిక సదస్సులో సీఎం ఎ.రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
”తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నాం. పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తాం. ఇక్కడ పెట్టే పెట్టుబడులకూ భద్రత ఉంటుంది. పెట్టుబడులు పెట్టి తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారండి” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాడిక్కడ పబ్లిక్‌ ఎఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా (పీఏఎఫ్‌ఐ) 12వ వార్షిక సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్‌ సమస్య ఉన్నా, తాము డ్రగ్స్‌ను కంట్రోల్‌ చేశామని అన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. పరిపాలన చేసేందుకు రాజకీయ సంకల్పం ఎంతో అవసరమని అన్నారు. భవిష్యత్‌ తరాలకు అవకాశాలను సృష్టించాలనేది మా ఆలోచన అని చెప్పారు. దేశంలో యంగెస్ట్‌ స్టేట్‌ (కొత్త రాష్ట్రం) తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు, హైదరాబాద్‌కు ఘనమైన చరిత్ర ఉందని, తెలంగాణ సర్వతోముఖాభివద్ధికి తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌-2047 రూపొందించామని అన్నారు. 2025 డిసెంబర్‌ 9న తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేస్తామని తెలిపారు.

తెలంగాణను కోర్‌ అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌గా విభజించామని, కోర్‌ అర్బన్‌ ఏరియాలో కోటి మంది నివసిస్తున్నారని అన్నారు. ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలిస్తున్నామని, సెమీ అర్బన్‌ ఏరియాను తయారీ రంగం జోన్‌గా (మాన్యుఫాక్చర్‌) నిర్ణయించామని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధికి తగినట్టు 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీటర్లు పొడిగించాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం ఐదు లక్షల మంది మెట్రోలో పయనిస్తున్నారని, దానిని 15 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. సబర్మతీ తీరంలా మూసీని మారుస్తామనీ, అందుకు మూసీ పునరుజ్జీవంపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణం చేపడుతున్నామని, 2027 నాటికి హైదరాబాద్‌ లో ఎలక్ట్రిక్‌ వాహనాలే ఎక్కువగా ఉండనున్నాయని చెప్పారు. అందుకే ఈవీలకు రాయితీలు ప్రకటించామని తెలిపారు. రాష్ట్ర అవసరాలకు తగినట్టు రీజినల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణం జరుగుతుందన్నారు. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, విమానాశ్రయం నుంచి భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి అనుసంధానత కల్పిస్తామని అన్నారు. తెలంగాణలో సేంద్రీయ పంటలు పండుతున్నాయని తెలిపారు.

యువతకు జ్ఞానంతో పాటు నైపుణ్యం అవసరమని, వారిలో ఆ నైపుణ్యాలు పెంచేందుకు యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని అన్నారు. మహాత్మాగాంధీ యంగ్‌ ఇండియా స్ఫూర్తిని అనుసరి స్తున్నామనీ, యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు మంచి ఉద్యోగాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. స్పోర్ట్స్‌లో దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలకు వచ్చే మెడల్స్‌ చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని, ఒలింపిక్స్‌ పతకాల సాధనే లక్ష్యంగా యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రం (ల్యాండ్‌ లక్డ్‌) కావడంతో ఓడ రేవు లేదని, మచిలీపట్నం ఓడరేవు అనుసంధానా నికి ఫ్యూచర్‌ సిటీ నుంచి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే.. దానికి సమాంతరంగా రైల్వే లైన్‌ మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని వివరించారు. బల్క్‌ డ్రగ్స్‌ ఉత్పత్తిలో 40 శాతం తెలంగాణే చేస్తోందని, వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్‌ ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలతో అమెరికాకే ఎక్కువగా నష్టమని సీఎం అన్నారు. ట్రంప్‌ ఒకరోజు మోడీ నా ఫ్రెండ్‌ అంటారని, మరో రోజు అడ్డగోలుగా సుంకాలు వేస్తారని విమర్శించారు. తెలంగాణలోనూ ఒక ట్రంప్‌ ఉండేవారని, ఆయనను తెలంగాణ ప్రజలు పక్కన పెట్టారని కేసీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. రాత్రి వచ్చిన ఆలోచనను తెల్లారే అమలు చేయడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్‌ భేటీ
ఢిల్లీలో సీఎం ఎ.రేవంత్‌ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్‌ పిలిప్‌ డి.ముర్పీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యా, గ్రీన్‌ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ (సినిమా రంగం), మౌలిక వసతులు (మెట్రో… పట్టణ రవాణా), మూసీ రివర్‌ ఫ్రంట్‌ తదితర అంశాలపై వారు చర్చించారు. తెలంగాణ విజన్‌ ఏ2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని సీఎం న్యూజెర్సీ గవర్నర్‌కు వివరించారు. అదే విధంగా ఐటీ, ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యాన్ని సీఎం తెలియజేశారు. భేటీలో గవర్నర్‌ సతీమణితో పాటు న్యూజెర్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. అదే విధంగా సీఎంతో అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ చేతన్‌ కృష్ణస్వామి భేటీ అయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -