– 2030 నాటికి వ్యయం
– ఎఐతో ఎగుమతులకు మద్దతు
– అమెజాన్ ఇండియా వెల్లడి
న్యూఢిల్లీ : దిగ్గజ ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా భారత్లో భారీగా విస్తరించనున్నట్లు తెలిపింది. 2030 నాటికి దేశంలో 35 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3.15 లక్షల కోట్లు) పెట్టుబడులను ప్రకటించింది. దీని ద్వారా అదనంగా 10 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపింది. బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన అమెజాన్ ఆరో సంభవ్ సమ్మిట్లో ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఈ కార్యక్రమంలో అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. 2010లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి చేసిన సుమారు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఇది అదనంగా ఉంటుందని తెలిపారు. తమ వ్యాపార సంస్థ ప్రస్తుతం 38 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పిస్తుందన్నారు. కంపెనీ తన దీర్ఘకాలిక భారత వ్యూహాన్ని కొన్ని ప్రధాన విభాగాల్లో కేంద్రీకరించినట్లు చెప్పారు. అమెజాన్ నేతృత్వంలో ఎఐ, డిజిటలైజేషన్, భారతీయ ఎగుమతులను పెంచడం, ఉపాధి అవకాశాల విస్తరణపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామన్నారు. ఇది భారతదేశం డిజిటల్, తయారీ ఎకోసిస్టమ్ల్లో తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయనుందన్నారు. ఈ ప్రయత్నాలు 1.2 కోట్ల చిన్న వ్యాపారాలను డిజిటలైజేషన్వైపు మళ్లించినట్లు చెప్పారు. ఈ క్రమంలో కొత్తగా ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాల లక్ష్యం అమెజాన్ విస్తరిస్తున్న డెలివరీ నెట్వర్క్లు, తయారీ, ప్యాకేజింగ్, రవాణా, సర్వీసులకు ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. లక్షలాది మంది భారతీయులకు ఎఐను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నామన్నారు. కేవలం ప్యాకేజింగ్, లాజిస్టిక్ విభాగాల్లోనే కాకుండా ఇతర విభాగాల్లోనూ ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలిపారు. 2030 నాటికి మా ఇ-కామర్స్ ఎగుమతులను నాలుగు రెట్లు పెంచి 80 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అమెజాన్ ఇండియా ఉన్నతాధికారులు ఉదిత్ మదన్, సమిర్ కుమార్, ధర్మేష్ మెహత్ పాల్గొన్నారు.
భారత్లో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు
- Advertisement -
- Advertisement -



