నవతెలంగాణ – కామారెడ్డి
సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి 02-02-2026న డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ (DPR) విభాగం వెబ్సైట్తో పాటు అక్రిడిటేషన్ మాడ్యూల్ను అధికారికంగా ప్రారంభించినట్లు కామారెడ్డి డిపిఆర్ఓ తిరుమల ఒక ప్రకటనలో తెలిపారు. 2026 – 28 సంవత్సరాలకు సంబంధించి అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం సమాచార, పౌర సంబంధాల శాఖ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు 28-02-2026న ముగియనున్నందున, అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు పంపే జర్నలిస్టుల పేర్ల జాబితాను సమాచార, పౌర సంబంధాల కమిషనర్, హైదరాబాద్ వారికి పంపాలన్నారు. జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం సంబంధిత జిల్లాల జిల్లా పౌర సంబంధాల అధికారులు (DPROలు) కు పేర్ల జాబితాను పంపవచ్చు. మీడియా యాజమాన్యాలు సూచించిన జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డుల కోసం డిపార్ట్మెంట్ వెబ్సైట్ http://or.telangana.gov.in ను సందర్శించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 09-02-2026 నుండి ప్రారంభమవుతుందనీ ఆమెయ ప్రకటనలో పేర్కొన్నారు.



