Monday, January 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేడారంలో ఇప్పపువ్వు లడ్డూకు ఆదరణ

మేడారంలో ఇప్పపువ్వు లడ్డూకు ఆదరణ

- Advertisement -

తొలిసారి మేడారం జాతరలో ఏర్పాటు
మార్కెట్‌లో మంచి డిమాండ్‌
మేడారం వేదికగా జరిగిన క్యాబినెట్‌ సమావేశంలోనూ ఈ లడ్డ్డూలు పంపిణీ
జనవరి 13న లడ్డూ విక్రయ స్టాల్స్‌ ప్రారంభం
ఇప్పటి వరకు రూ. 3 లక్షల వ్యాపారం
మేడారం పరిసరాలలో 10 స్టాల్స్‌ ఏర్పాటు
సమ్మక్మ సారలమ్మ మహిళా రైతు ఉత్పత్తుల సంఘం ఆధ్వర్యంలో తయారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతి గడించిన మేడారం మహా జాతరలో మొట్టమొదటిసారిగా ఇప్పపువ్వు లడ్డూల విక్రయాలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా గిరిజన మహిళా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో తయారుచేసిన అత్యంత పోషకాలు కలిగిన ఇప్పపువ్వు లడ్డూ మేడారం వచ్చే భక్తులకు అందుబాటులో ఉంది. ఇప్పపువ్వు లడ్డు తినడం ద్వారా అధిక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెప్తున్నారు. జీర్ణ క్రియ మెరుగుపడడం, రోగ నిరోధక శక్తిని పెరగడం, గుండె కొలెస్ట్రాల్‌ తగ్గించడం, అధిక శక్తిని పొందడం, బరువు నియంత్రణతో పాటు డయాబెటీస్‌ తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని సూచిస్తు న్నారు. పూర్వకాలంలో ఆదివాసీ గిరిజనులు ఇప్పపువ్వును అనేక వ్యాధులకు మందుగా ఉపయోగించేవారనీ, ఇప్పటికీ గుత్తి కోయ గూడాలలో వారి పిల్లలకు ఇప్పపువ్వు కుడుములు లడ్డూలు తినిపించడం ద్వారా పిల్లలు పౌష్టికంగా బలంగా ఉంటారని గిరిజనులు చెప్తున్నారు.

గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా
గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దానిలో భాగంగానే ఇప్పపువ్వు లడ్డు తయారీ ద్వారా గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. తెలంగాణ సమగ్ర జీవనోపాధి కార్యక్రమం ద్వారా గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం ద్వారా 12 మంది గిరిజన మహిళలతో ప్రత్యేకంగా సమ్మక్క, సారలమ్మ మహిళ రైతు ఉత్పత్తుల సంఘం ఏర్పాటు చేశారు. వీరికి రాష్ట్ర గవర్నర్‌ దత్తత గ్రామం కొండపర్తి గ్రామంలో ఉట్నూర్‌ ఐటీడీఏ నుంచి వచ్చిన ప్రత్యేక బందం ఇప్పపువ్వు లడ్డు తయారీ, క్రయ విక్రయాల గురించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శిక్షణ అందించారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో ఇప్పపువ్వు లడ్డు తయారీ యూనిట్‌ను ప్రారంభించడం జరిగింది. ఈసం మంగవేణి, ఇర్ప మంజుల, ఇర్ప మౌనిక, ఈసం సాంబలక్ష్మి, ఈసం వరలక్ష్మి ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ మహిళ రైతు ఉత్పత్తుల సంఘం ఏర్పాటు చేసి ఎంఎస్‌ఎమ్‌ఈలో రిజిస్ట్రేషన్‌ చేసి ప్రత్యేకంగా ఫుడ్‌ లైసెన్స్‌ కూడా తీసుకున్నారు. కన్నేపల్లి గ్రామం నుంచి చెరుప నాగమణి, గొండి అనురాధ, గొండి మాణిక్యం, గొండి స్వరూప ఆధ్వర్యంలో ఫుడ్‌ లైసెన్స్‌ అందుకున్నారు. మేడారం మహా జాతర వేదికగా జనవరి 13వ తేదీన ఇప్పపువ్వు లడ్డు స్టాల్స్‌ను రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించింది. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా రూ.3 లక్షల వ్యాపారం జరిగిందని నిర్వాహకులు చెప్పారు. ఈనెల 18న జరిగిన మంత్రుల క్యాబినెట్‌ సమావేశంలో ఇప్పపువ్వు లడ్డులను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో పాటు అధికారులకు పంపిణీ చేశారు. మేడారం వచ్చే భక్తులకు జాతర పరిసరాలలో పది స్టాల్స్‌ ఏర్పాటు చేశామనీ, ఒక బాక్స్‌లో 250 గ్రాములతో రూ.150కు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. తమకు సహకరిస్తున్న మంత్రి అనసూయ సీతక్కకు, జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌కు, డీఆర్డీఏ అధికారులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు
గర్భిణీ స్త్రీలు ఇప్పపువ్వు లడ్డు తినడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని కూడా నిపుణులు సూచిస్తు న్నారు. ఇందులో ఉండే ఫైబర్‌ , విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు గర్భిణీ స్త్రీలకు ఎంతగానో మేలు చేస్తుందని పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా జన్మిస్తారని చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -