Thursday, June 26, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఇరాన్‌, ఇజ్రాయిల్‌ యుద్ధం: కాల్పుల విరమణలో గెలుపెవరిది?

ఇరాన్‌, ఇజ్రాయిల్‌ యుద్ధం: కాల్పుల విరమణలో గెలుపెవరిది?

- Advertisement -

జూన్‌ 13న ఇరాన్‌పైన ఇజ్రాయిల్‌ ప్రారంభించిన అక్రమ యుద్ధం పన్నెండు రోజుల తర్వాత ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది. ఇది ప్రపంచ ప్రజలందరూ ఆహ్వానించ దగిన పరిణామం. ఎందుకంటే యుద్ధం వల్ల నష్టపోయేది ఆ రెండు దేశాల ప్రజలు మాత్రమే కాదు. దాని ప్రభావం ప్రపంచం మొత్తమ్మీద పడి ఉండేది. ముఖ్యంగా ఇరాన్‌ ప్రకటించినట్టుగా ‘హర్మోజ్‌ జలసంధి’ని మూసేసి ఉంటే చమురు ధరలు చుక్కలనంటేవి. ఒక అంచనా ప్రకారం బ్యారెల్‌ 150డాలర్ల దాకా (అది ఇప్పుడు 78డాలర్లకు పెరిగి తగ్గింది)ధర పెరిగే ప్రమాదం ఉండేది. మన దేశ ఆయిల్‌ అవసరాల్లో 90శాతం దిగుమతులే కాబట్టి ఆ భారం మనపై ఇంకా ఎక్కువగా ఉండేది. అంతేగాక ఆయిల్‌ ధరలు పెరిగితే ప్రపంచ వ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగి ఆర్థిక సంక్షోభాలకు దారితీయటం, అసలే అంతంత మాత్రంగా ఉన్న ప్రపంచ ఆర్ధికవ్యవస్థ గమనం గందరగోళమవటం జరిగేది. అందువల్ల జరిగిన శాంతి ఒప్పందానికి మనందరం సంతోషిద్దాం.
ఇక రెండో విషయం ఈ శాంతి ఒప్పందం కూడా షరా మామూలుగా పాకిస్తాన్‌, ఇండియా కాల్పుల విరమణ ఒప్పందం లాగే ‘నేనే చేశానని’ ట్రంప్‌ ఉత్సాహంగా ప్రకటించాడు. బహుశా ‘నోబెల్‌ శాంతి బహుమతి’ తనకే ఇవ్వాలనే ఆయన కోరికకు మరో అదనపు పాయింటు దొరికిందనే ఆనందం కూడా అయ్యుండొచ్చు. యుద్ధంలో అనుకున్న లక్ష్యాలు సాధించామని ఇజ్రాయిల్‌, అమెరికాలు ప్రకటించాయి. మరోవైపు ఇరాన్‌ ‘ఈ అక్రమ యుద్ధాన్ని ప్రారంభించింది ఇజ్రాయిలే అయినా, దానికి మద్దతివ్వటమేగాక, తానూ స్వయంగా దాడిలో పాల్గొన్న అమెరికా, అధ్యక్షుడు ట్రంప్‌ ప్రాధేయపడితేనే మేము కాల్పుల విరమణకు అంగీకరించాము’ అని ప్రకటించింది. అమెరికా స్థావరాలపై దాడిచేసిన సాహసం కూడా మాదే అని కూడా ఇరాన్‌ ప్రకటించింది. ఇంతకీ ఈ యుద్ధంలో గెలిచిందెవరు?
డొనాల్డ్‌ ట్రంప్‌ తన ‘సోషల్‌మీడియా ట్రూత్‌ సోషల్‌’లో చేసిన ప్రకటనలో ”మా విమానాలు ఇరాన్‌ మూడు అణుస్థావరాలను ధ్వంసం చేసి జయప్రదంగా తిరిగొచ్చాయి” అని ప్రకటించాడు. తర్వాత ఒకటి,రెండ్రోజుల్లోనే శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా అది వాస్తవం కాదని, ఆ కేంద్రాలు పాక్షికంగా మాత్రమే దెబ్బతిన్నాయని తేలింది. ఈ విషయాన్ని అమెరికన్‌ ఇంటిలిజెన్స్‌ రిపోర్టులు కూడా బయటపెట్టాయి. సిఎన్‌ఎన్‌ ఇంకా అనేక ప్రముఖ టీవీ ఛానళ్లు ఈ విషయాలను ప్రముఖంగా ప్రసారం కూడా చేశాయి. ఇదే విషయం అమెరిన్‌ రక్షణశాఖ పెంటగాన్‌ వర్గాలను ప్రశ్నిస్తే ‘మా ఇంటిలిజెన్స్‌ సమాచారం లీక్‌ కావటం విచారకరం’ అన్నారు. అదీ సంగతి. అంటే ఈ దాడులతో ఇరాన్‌ అణుస్థావరాలకు జరిగిన నష్టం చాలా స్పల్పం. దీనివల్ల ఇరాన్‌ అణుశుద్ధి కార్యక్రమం మహాఅయితే కొన్ని వారాలో, లేక నెలలో ఆలస్యమవుతుంది తప్ప ఆగిపోదనేది ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్న సత్యం. పైగా ఈ పరిణామాలతో అంతకు ముందు ‘మా అణు కార్యక్రమం పౌరప్రయోజనాలకే తప్ప బాంబు తయారీకి కాదు. అంతర్జాతీయ అణు పర్యవేక్షక సంస్థ తనిఖీలకు మేము ఎప్పుడూ సహకరిస్తూనే వచ్చాము.కానీ ఇప్పుడు మేము ఈ పర్యవేక్షణకు అంగీకరించం. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం నుండి విరమించుకుంటున్నాం” అని ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా ముఖ్య విషయం. అంటే ఇప్పుడు అణ్వస్త్రం తయారు చేసుకోవటానికి ఇరాన్‌ సిద్ధపడుతుందనేది స్పష్టం. గత చరిత్ర చూస్తే ఇప్పుడు ఇరాన్‌ ఈ యుద్ధ అనుభవంతో భవిష్యత్తులో ఏం చేయబోతున్నదో మనకు తేలిగ్గానే అర్ధమౌతుంది. అమెరికా ఈ దుశ్చర్యలు వాస్తవంగా అణ్వాయుధాలను అదుపు చేయటానికి కాక, వాటిని కలిగి ఉండటానికే దేశాలను ప్రోత్సహిస్తాయి. 1990లో ఇరాక్‌పై అమెరికా అక్రమంగా యుద్ధం (గల్ఫ్‌వార్‌) చేసింది. ఆ తర్వాతనే ఇరాక్‌ అణ్వాయుధ సామర్థ్యం కోసం విపరీతంగా నిధులు కేటాయించి దాని తయారీకి ప్రయత్నించింది. 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్‌ ‘యాక్సిస్‌ ఆఫ్‌ ఎవిల్‌’ ప్రసంగంలో ఇరాన్‌, ఇరాక్‌, ఉత్తర కొరియాలను దుష్టదేశాలుగా ప్రకటించాడు. మరుసటి సంవత్సరమే ‘రసాయనిక ఆయుధాలున్నాయనే’ నెపం మోపి ఇరాక్‌పై అమెరికా దాడి చేసి ఆ దేశాన్నే ధ్వంసం చేసింది. ఆ దేశాధినేత సద్దాం హుస్సేన్‌ను ఉరితీసింది. ఈ పరిణామాలు చూసిన ఉత్తర కొరియా అదే ఏడాది అణుఒప్పందం నుండి విరమించుకుని తాను స్వయంగా అణ్వాయుధాన్ని తయారు చేసుకుంది. అమెరికా అప్పటినుంచి ఉత్తర కొరియా జోలికెళ్లే సాహసం చేయలేకపోతోంది. పైగా ఆ దేశంతో శాంతి ఒప్పందాలకు ట్రంప్‌ తహతహలాడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది. ఇది ఇలా ఉంటే, దీనికి విరుద్ధంగా అమెరికా దాడిచేస్తుందని భయ పడి లిబియా నేత గడాఫీ 2003లో అమెరికాతో ఒప్పందానికి వచ్చి తానే తన అణుస్థావరాలను ధ్వంసం చేసుకున్నాడు. కానీ తర్వాత ఏం జరిగింది? ఎనిమిదేండ్ల తర్వాత 2011లో లిబియాలో అంతర్గత తిరుగుబాటును ప్రోత్సహించి గడా ఫీని చంపి ఆ ప్రభుత్వాన్ని అమెరికా కూలదోసింది. అందువల్ల అమెరికాకు లొంగిఉండాలి, లేదంటే దాని అక్రమాలను అడ్డుకుని ధైర్యంగా నిలబడి అణ్వాయుధాన్ని కలిగి ఉండాలనే పరిస్థితి ప్రపంచమంతటా ఏర్పడుతోంది.ఈ పరిస్థితిని అంతా చూస్తే ఆయుధపోటీకి, అణ్వస్త్రవ్యాప్తికి, మొత్తంగా ఉద్రిక్తతలకు, యుద్ధాలకు అమెరికన్‌ సామ్రాజ్యవాద ఆధిపత్య ధోరణులు, అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి దోపిడీ నైజమూ అసలు కారణాలనేది మనం గ్రహించాలి.
అలాగే ఈ యుద్ధం ద్వారా ఇరాన్‌లో ‘అధికారమార్పిడి’ అనేది కూడా ఇజ్రాయిల్‌, అమెరికాల మరో లక్ష్యం. అందుకుగాను ఎప్పుడో 1979లో పదవీచ్యుతుడైన ఇరాన్‌ అధిపతి ‘షా’ మనవడొకణ్ని ముందుకుతెచ్చే ప్రయత్నమూ జరిగింది. ‘తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్లు’ అమెరికాలో ‘అనాధ’గా ఉన్న ఆ అమాయకుడితో ‘అధికారం తీసుకోవటానికి నేను సిధ్ధమే’ అని ప్రకటన కూడా చేయించారు. ఈ పగటి కలలన్నీ పటాపంచలయ్యాయి. పైగా అంతకుముందు పాలనా వైఫల్యాలు, అప్రజాస్వా మిక విధానాల వల్ల ఇరాన్‌ ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి పక్కకుపోయి అమెరికా, ఇజ్రాయిల్‌ల యుద్ధ బీభత్సానికి వ్యతిరేకంగా ఇరాన్‌ ప్రజలంతా ఒకతాటిపైకి వచ్చి అండగా నిలవడమే మనకు కనపడుతున్నది.
అందువల్ల ఇజ్రాయిల్‌, అమెరికాలు ఇరాన్‌పై సాగించిన ఈ యుద్ధమూ, జరిగిన కాల్పుల విరమణ ప్రహసనమూ ఇరాన్‌ భయపడటానికో, లొంగిపోవటానికో కాక తన ఉనికిని కాపాడుకునేందుకు, రాబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు అణ్వాయుధ తయారీతో సహా అన్నివిధాలా పూనుకునేందుకే దారితీస్తుందనేది నిశిత పరిశీలకుల అంచనాగా ఉంది. అందువల్ల ఈ కాల్పుల విరమణ అది తాత్కాలికమా? శాశ్వతమా అనేది పక్కనబెడితే అమెరికన్‌ సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తుల విజయంగా మనం భావించాలి.
తమ్మినేని వీరభద్రం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -