రైతులదే కీలక పాత్ర..
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం మరోసారి సాగునీటి సంఘాల ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టులపై ఇటీవల ప్రభుత్వం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజకీయ నిరుద్యోగం కొంత మేర తగ్గించడంలో భాగంగా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వ ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2006లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2008 వరకు ఉమ్మడి రాష్ట్రం లో 10,748 సాగునీటి సంఘాలు ఏర్పాటయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో రద్దు చేశారు. అప్పటి నుంచి సాగునీటి సంఘాల ఊసేలేదు. మండల ల్ వ్యాప్తంగా 18చెరువులు,కాపురం,ఎడ్లపల్లిలో రెండు చిన్నతరహా ప్రాజెక్టులు, 112 కుంటలు ఉన్నాయి. ఆయా చెరువుల కింద 16,140 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఆయా చెరువుల సంరక్షణ ఇప్పటి వరకు ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.
రైతులదే కీలక పాత్ర..
సాగునీటి సంఘాల్లో రైతులదే కీలక పాత్ర పోషిస్తారు. కాల్వలు, తూములు, షెట్టర్ల మరమ్మతులు, నీటి వనరుల నిర్వహణ,నీటి వినియోగం, మరమ్మతుల వంటి సంరక్షణకు సాగునీటి సంఘాలు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రస్తుతం సాగునీటి సంఘాల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు సంఘాలుగా ఏర్పడి చెరువుల అభివృద్ధి జరిగేందుకు ఎంతో దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. ఈ సంఘాల ఏర్పాటు ద్వారా నాయకులు, రైతులకు ఉపయోగం జరగనుంది. దీనిపై ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులను జారీ చేయనున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి.



