ప్రస్తుతం డీఎంకే రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు
న్యూఢిల్లీ: వచ్చే నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (67)ను తమ అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎంపిక చేసినట్టు కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ వెల్లడించింది.సోమవారం ప్రధాని మోడీని సీపీ రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు.అయితే.. విపక్ష ఇండియా బ్లాక్ కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందని డీఎంకే పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివ పేరును ఆ పార్టీ ప్రతిపాదించినట్టు సమాచారం. ప్రస్తుతం డీఎంకే కీలక భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.దీంతో రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ‘ఇండియా’ బ్లాక్ ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీయే ప్రకటించడంతో, అదే తమిళనాడు నుంచి డీఎంకే అభ్యర్థిని దించడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలని విపక్ష బ్లాక్ భావిస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్డీఏ నుంచి బరిలో దిగిన రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ నుంచి గోదాలోకి దిగనున్న తిరుచ్చి శివ ఇద్దరూ తమిళనాడు రాష్ట్రం నుంచే ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీచేయనున్నట్టు సమాచారం.
ఇండియా బ్లాక్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తిరుచ్చి శివ?
- Advertisement -
- Advertisement -