డీపీఓ ఫోన్ తో మొర్రం తరలింపు నిలిపివేసినట్లు కార్యదర్శి వివరణ
నవతెలంగాణ – పరకాల : హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో మొరం దందా కోసం పంచాయతీ ట్రాక్టర్ వినియోగిస్తున్నట్లు సమాచారం. గత మూడు రోజులుగా గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను ఎలాంటి అనుమతులు లేకుండా మొర్రం దందా కోసం వినియోగిస్తున్నట్లు గ్రామస్తులు బహిరంగంగా చర్చించుకోవడం గమనార్హం. గ్రామపంచాయతీ ట్రాక్టర్ను వినియోగించి ప్రయివేట్ వ్యక్తులకు మొర్రం తరలిస్తుండగా అందుకు సంబంధించిన ఫోటోలను సెల్ఫోన్లో చిత్రీకరించిన ఓ యువకున్ని కొంతమంది వ్యక్తులు దాడి చేసి సెల్ ఫోన్ సైతం గుంజుకున్నట్లు సమాచారం.
ఇందుకు సంబంధించి ఆ యువకుడు పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మొర్రం దందా మండలానికి చెందిన ఓ కీలక నేత కనుసన్నల్లో సాగుతున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శి కిరణ్ ను పొన్లో సంప్రదించి వివరణ కోరగా.. మొర్రం తరలించిన మాట వాస్తవమే.. గ్రామంలో వాటర్ ట్యాంక్, చేతి పంపు వద్ద పోయించడం జరిగిందన్నారు. డిపీఒ సూచన మేరకు మొర్రం తరలింపు ఆపినట్లు తెలిపారు. ట్రాక్టర్లో మొర్రం తరలిస్తున్న క్రమంలో తాను అందుబాటులో లేనట్టు పంచాయతీ కార్యదర్శి కిరణ్వి వరించడం గమనార్హం.