Thursday, June 5, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅన్నదాతకిచ్చే'మద్దతు' ఇదేనా?

అన్నదాతకిచ్చే’మద్దతు’ ఇదేనా?

- Advertisement -

నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు మళ్లీ అన్యాయం చేసింది. ఉత్పత్తి వ్యయంతో సంబంధం లేకుండా ఇటీవల పద్నాలుగు ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను, రైతు సంఘాల విజ్ఞప్తులను బుట్టదాఖలు చేసి, కంటితుడుపు తతంగంగా ధరల నిర్ణయం చేసింది. రైతులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని స్వీయభజన చేసుకునే బీజేపీ దగాకోరుతనానికి కనీస మద్దతులో కొరవడ్డ చిత్తశుద్ధే ఒక ఉదాహరణ. ఏటేటా పెరుగుతున్న పెట్టుబడికి, మద్దతు ధరకీ లంగరు అందక తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్న రైతాంగం దాదాపు నాలుగు దశాబ్దాలుగా రక్షణ కోసం గావుకేక వేస్తోంది. 1995 -2022 మధ్య దేశంలో 3,96,438 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. వ్యవసాయం బతుకు భరోసా ఇవ్వక ప్రతిరోజూ దేశంలో 33 మంది అన్నదాతలు ప్రాణాలు తీసుకుంటున్నట్టు లెక్కలు వక్కాణిస్తున్నాయి. రైతు కన్నీరు కార్చిన చోట అభివృద్ధికి, ఆధునికతకీ అర్థమే లేదని సామాజికవేత్తలు తరచూ ఉటంకిస్తారు. మరి ఏటా ఇంతమంది రైతుల ఉసురు తీసుకుంటున్నా.. పాలకులు ఏం అభివృద్ధి సాధిస్తున్నట్టు? ఎవరి సంపద సృష్టికి అహర్నిశలూ పాటు పడుతున్నట్టు?
వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి బయటపడ్డానికి 2006లో స్వామినాథన్‌ కమిషన్‌ కొన్ని విలువైన సూచనలు చేసింది. పంట ఉత్పత్తి వ్యయానికి యాభై శాతం అదనంగా కలిపి (సి2 ప్లస్‌ 50 శాతం) గిట్టుబాటు ధర కల్పించాలని సిఫార్సు చేసింది. పాలకులు దానిని పట్టించుకున్నదే లేదు. పదకొండేళ్లుగా మోడీ ప్రభుత్వం కిసాన్‌ ఉద్ధరిణిగా గొప్పలు చెప్పుకుంటూ, ఆచరణలో తీవ్ర ద్రోహానికి పాల్పడుతోంది. ఈ ఏడాది వరి మద్దతు ధర కేవలం రూ.69 పెంచింది. సాగు వ్యయం చాంతాడులా పెరిగితే.. అది అందించిన సాయం ఉంగరపు తాడంత కూడా లేదు. మొక్కజన్న, కంది, మినుము, వేరుశనగ వంటి పంటలకు నిజమైన వఅద్ధి రేటు ఒక శాతం కన్నా తక్కువగానే ఉంది. ఒక క్వింటా వరి ఉత్పత్తికి జాతీయ సగటు వ్యయం రూ.3135 కాగా, మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఘనంగా ప్రకటించిన మద్దతు ధర రూ.2369. పత్తికి రూ.16 వేల మేర కనీస మద్దతు ధర ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ప్రతిపాదించింది. కేంద్రం తన మద్దతును రూ.7710కే పరిమితం చేసింది. రాగులు, జన్న, నువ్వులు, కంది వంటి పంటల విషయంలోనూ ఇదే దుస్థితి! మోడీ ప్రభుత్వ మద్దతు ధరల ప్రహసనం కేవలం కంటితుడుపునకే తప్ప – రైతుల కష్టనష్టాలను, కన్నీరునూ అరికట్టటానికి కాదని అర్థమవుతోంది.
కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణ పథకాన్ని కొనసాగించటం గురించి గొప్పగా చెబుతూనే- దీనివల్ల ఖజానాపై రూ.15 వేల 640 కోట్ల భారం పడుతుందని కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వాపోయారు. కొన్ని లక్షల కోట్ల వ్యయప్రయాసలను నిత్యం మోస్తున్న రైతులకు అందించే రుణ సహాయాన్ని ‘భారం’గా భావించటంలోనే ఈ పాలకుల మొసలి కన్నీరు బయటపడుతుంది. కేంద్ర ప్రభుత్వం అరకొరగా అందిస్తున్న రూ.6 వేల పిఎం కిసాన్‌లో నమోదైన రైతుల సంఖ్య 9 కోట్ల 70 లక్షలు మాత్రమే! కార్పొరేట్లకు ఏటా లక్షల కోట్ల లబ్ధి చేకూర్చే మోడీ ప్రభుత్వం ఈపాటి సహాయానికే గొప్పలు చెప్పుకోవడం, పెనుభారం అన్నట్టు పెడ బబ్బలు పెట్టడం విచిత్రంగా ఉంది.
దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగం కీలకమైన భూమిక వహిస్తోంది. కోట్లాది మంది రైతుల, వ్యవసాయ కార్మికుల, కౌలుదారుల అమూల్యమైన శ్రమ తగిన ప్రతిఫలం పొందకుండానే దేశంలోని అన్ని తరగతుల ప్రజలకు ఆహారంగా సమకూరుతోంది. వ్యవసాయం కార్పొరేటీకరణ చెందితే- మధ్య తరగతి ప్రజలు సైతం ఆహార ధాన్యాలను కొనుక్కోవటానికి పెద్దఎత్తున ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. భారతదేశపు లక్షలాది గ్రామాల్లో ఉన్న రైతులను, వ్యవసాయ కార్మికులను, వారంతా ఆధారపడే వ్యవసాయరంగాన్ని కాపాడుకోవడం దేశంలోని ప్రజలందరి కర్తవ్యం. అందుకోసం ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ ప్రతిపాదించిన సిఫార్సులు అమలు చేయాలని రైతులూ, రైతు సంఘాలూ చాలా ఏళ్లుగా సాగిస్తున్న పోరాటంలో గొంతు కలపాలి. రైతుకు మద్దతు ఇవ్వడం అంటే దేశపు వెన్నెముకకు అండగా నిలబడడమే!
– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -