నాటకీయ పరిణామాలు జరుగుతున్న పూర్వరంగంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు.అదే జరిగినట్లు కనిపిస్తోంది.పన్నెండు రోజుల పాటు సాగిన ఇజ్రాయిల్-ఇరాన్ పోరు ముగిసిందని, రెండు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. రెండు దేశాలూ దీన్ని ధృవీకరించాయి. తర్వాత ఇరాన్ మీద ఆరోపణలు చేస్తూ ఇజ్రాయిల్ మంగళవారం నాడు టెహరాన్మీద దాడులకు తెగబడినట్లు వార్తలు.అంతకు ముందు ఇరాన్ కూడా దాడి జరిపి నలుగురి ప్రాణాలు తీసిందని ఇజ్రాయిల్ ఆరోపించింది. టెల్అవీవ్ చర్యలను ట్రంప్ ఖండించాడు, పనిలో పనిగా ఇరాన్ మీద విమర్శలు కూడా చేశాడు. మూడు పక్షాలూ విజయం తమదంటే తమదే అని ప్రకటించుకున్నాయి. దాని సంగతి ఎలా ఉన్నా మూడు దేశాలకూ తలబొప్పి కట్టింది. ప్రపంచ దేశాలకు పెద్ద ప్రమాదం తప్పినందుకు శాంతిని కోరుకొనే వారందరూ సంతోషించే పరిణామం ఇది.తాము అనుకున్నవన్నీ సాధించామని, ఉల్లంఘనలకు పాల్పడితే తిరిగి దాడులు చేస్తామని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. అంతకు ముందు ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ దాడులు కొనసాగిస్తున్నదని ఇజ్రాయిల్ ఆరోపించింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్, ఇజ్రాయిల్ ఆక్రమణలోని జెరూసలెంలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. దక్షిణ ఇజ్రాయిల్ పట్టణం బీర్షిబాపై జరిగిన దాడిలో నలుగురు మరణించారు. అంతకుముందు కతార్ రాజధాని దోహా సమీపంలో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరం మీద ఇరాన్ క్షిపణిదాడి చేసింది. ట్రంప్ ప్రకటనతో ముడిచమురు మార్కెట్లో ధరలు పడి పోయాయి. ప్రామాణిక బ్రెంట్ రకం ధర జూన్ 12న 69.36 డాలర్లు ఉండగా 78 డాలర్లు దాటింది, మంగళవారం ఉదయానికి 68-69 డాలర్లకు పడిపోయింది. ఇజ్రాయిల్ చర్యలతో ఈ ఒప్పందం సజావుగా అమలు జరుగుతుందా, ఇతర సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారన్న చర్చ మొదలైంది. ఇంతటితో నెతన్యాహు దాడులను విరమించకపోతే ఇరాన్ కూడా దానికి ప్రతిస్పందన మొదలెడుతుంది.
పశ్చిమాసియాలో ఏం జరగనుంది?
పశ్చిమాసియాలో ఏం జరగనుంది, కాల్పుల విరమణ అమలు జరుగుతుందా, ఆకస్మికంగా జరుగుతున్న పరిణామాల వెనుక ఏం జరిగిందీ అని పరిపరివిధాలుగా చర్చలు సాగుతున్నాయి. వాటన్నింటికీ కొద్ది రోజుల తర్వాతే ఒక సమాధానం దొరుకుతుంది. యుద్ధాలు, ఉద్రిక్తతల సమయంలో ముందుగా బలయ్యేది ”నిజం”. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక అన్నట్లుగా ఎవరేమి చెప్పినా దాన్ని యధాతధంగా తీసుకుంటే ఇబ్బందుల్లో పడతాము. ట్రంప్ ప్రకటనకు ముందు, తర్వాత ఏం జరిగిందన్నది ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం. రెండు వారాల తర్వాత తాము యుద్ధంలో పాల్గ్గొనేదీ లేనిదీ వెల్లడిస్తామని ప్రపంచాన్ని తప్పుదారి పట్టించిన ట్రంప్ రెండు రోజుల్లోనే బి2 బాంబర్లతో ఇరాన్లోని అణుకేంద్రాలున్నట్లు భావిస్తున్న ప్రాంతాలపై దాడులు చేసి వాటిని పనికిరాకుండా చేశామని ప్రకటించాడు. అయితే అదింకా నిర్దారణ కాలేదని అమెరికన్ అధికారులే చెప్పారు. ముందుగానే ఊహించిన ఇరాక్ పాక్షికంగా శుద్ధి చేసిన 408 కిలోల యురేనియం, పరికరాలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వార్తలు. దీనికి ప్రతీకారంగా సోమవారం నాడు కతార్లోని అల్ ఉదీద్ అమెరికా మిలిటరీ స్థావరంపై ఇరాన్ దాడిచేసింది. తమలక్ష్యం ఇరాన్లోని అణుశుద్ధి సామర్ధ్యాన్ని దెబ్బతీయటమేనని, దాన్ని జయప్రదం కావించినట్లు ట్రంప్ చెప్పాడు. అలాంటిదేమీ లేదని ఇరాన్ చెప్పగా, కొత్తగా రేడియేషన్ ముప్పులేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెప్పింది. పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఖాళీ చేసిన తర్వాత ఎవరూ లేని భవనాలను మనదేశం దెబ్బతీసినట్లుగా అమెరికా దాడి ఉన్నట్లు చెప్పుకోవచ్చు.గగనతలంలోనే ఇంథనం నింపుకుంటూ దాదాపు పన్నెండువేల కిలోమీటర్ల దూరం 37 గంటల పాటు ప్రయాణించి బి2 బాంబర్లు దాడి చేసి వెనక్కు వెళ్లిపోయాయి. ఆటముగియలేదు అని దాడి తర్వాత ఇరాన్ ప్రకటించింది.తామెవరికీ హాని తలపెట్టలేదని అయితే ఎవరి నుంచీ ఎట్టిపరిస్థితిలోనూ వేధింపులను సహించేది లేదని అధినేత అలీ ఖమేనీ ప్రకటించాడు.
ప్రజాస్వామ్య ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్
రెండు దేశాలూ శాంతికోసం తనను సంప్రదించాయని డోనాల్డ్ ట్రంప్ చెప్పుకున్నాడు. కాల్పుల విరమణకు ట్రంప్ తమను అభ్యర్ధించినట్లు ఇరాన్ ప్రకటించింది.రెండు దేశాలూ ఏదో విధంగా ఒప్పందం కుదరాలనే చూశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాల్పుల విరమణ వెనుక కతార్ కూడా ఉందనే వార్తలొచ్చాయి. దోహా సమీపంలో ఉన్న అమెరికా వైమానిక స్థావరం మీద తాము దాడి చేయనున్నట్లు ముందుగానే ఇరాన్ తెలియచేసింది. తమ సత్తా ఏమిటో చూపేందుకే టెహరాన్ క్షిపణి దాడి చేసినట్లు కనిపిస్తోంది. యుద్ధమన్న తర్వాత ఉభయపక్షాలకూ నష్టమే. ఇప్పటికే ఆంక్షలతో బాగా దెబ్బతిన్నది ఇరాన్. గాజామీద దాడులు చేస్తూ ఇజ్రాయిల్ కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోయింది.ఇరాన్ మీద దాడులకు కూడా దానికి భారీగానే చేతిచమురు వదిలింది. అన్నింటికీ మించి పశ్చిమదేశాలు అందించిన రక్షణ కవచం ఐరన్ డ్రోమ్ తమను పూర్తిగా కాపాడుతుంది అన్న భ్రమల్లో ఉన్న ఇజ్రాయిలీలు అది పూర్తిగా వాస్తవం కాదని తొలిసారి తెలుసుకున్నారు. దీంతో సాధారణ పౌరుల నుంచి వచ్చిన ఒత్తిడి కూడా నెతన్యాహు మీద పనిచేసిందనే చెప్పాలి. అమెరికాదీ అదేపరిస్థితి, ఇజ్రాయిల్కు ఎంతగా ఆయుధాలమ్మినా దాని వలన అమెరికన్ కంపెనీలకు లాభాలు తప్ప సాయం రూపంలో ఇచ్చే మొత్తం అమెరికా ఖజానా నుంచే భరించాల్సి ఉంది.ఇరాన్ అణుకేంద్రాలపై దాడి తర్వాత దాని గురించి అమెరికా జనంలో పరిణామాలు, పర్యవసానాల గురించి, అసలు ఇది సరైన చర్యేనా? అని పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. భవిష్యత్లో అమెరికా ఏ యుద్ధంలోనూ పాల్గొనదని ప్రకటించిన ట్రంప్ ఇలా చేశాడేమిటి? అని తర్జన భర్జనలు పడ్డారు. ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పటంతో ప్రపంచంలోని అమెరికన్లందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ట్రంప్ సర్కార్ హెచ్చరించటం కూడా దీనికి తోడైంది. ట్రంప్ చర్యను డెమోక్రటిక్ పార్టీ విమర్శించటం, అనేకచోట్ల యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరగటంతో ట్రంప్పై ఒత్తిడి పెరిగింది.
అమెరికా పరవుపోయే పని!
ఇరాన్ అణుశుద్ధి సామర్ధ్యాన్ని పూర్తిగా దెబ్బతీశామని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అందువలన అంతకు ముందు మాదిరి తమతో మరోసారి ఒప్పందానికి రావాలని డిమాండ్ చేసే అవకాశం లేదు. దానికి భిన్నంగా ఒప్పం దానికి పట్టుబడితే చెప్పిన మాటలన్నీ డొల్ల అని యావత్ ప్రపంచం భావించటమే కాదు, అమెరికా పరువు పోతుంది. ఈ పూర్వరంగంలో అమెరికా ఏకపక్షంగా వైదొలిగిన ఒప్పందం భవిష్యత్ ఏమిటి? ఇరాన్ తిరిగి తన కార్యక్రమాన్ని కొనసాగిస్తుందా? ఇవన్నీ శేష ప్రశ్నలు.దౌత్య తరుణం తప్ప 2015లో కుదిరిన ఒప్పందాన్ని పునరుద్ధరించే అవకాశాలు లేవని రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ రయబకోవ్ వ్యాఖ్యానించాడు.అయితే ట్రంప్ ప్రకటనకు ముందే ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఐరాస, అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలంటే అణుకార్యక్రమం నుంచి ఇరాన్ తప్పుకోవాలని, దానికి బదులు శాంతియుత ప్రయోజనాలకు సహకరిస్తామని హామీనిచ్చిన ఒప్పందాన్ని సులభంగా ఇరాన్ అణు ఒప్పందం అని పిలుస్తున్నారు. దాని పూర్తి పేరు ”సంయుక్త సమగ్ర కార్యాచరణ పధకం(జెసిపిఓఏ). ఇరాన్తో పాటు భద్రతా మండలిలో ఉన్న ఐదు శాశ్వత సభ్యదేశాలైన అమెరికా,రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్సు, ఐరోపా యూనియన్తో పాటు జర్మనీ దీనిలో భాగస్వాములు. 2013లో సంప్రదింపులు ప్రారంభమై 2015లో ఒప్పందం కుదిరింది.మరుసటి ఏడాది జనవరి 20 నుంచి అమల్లోకి వచ్చింది.ఈ ఒప్పందాన్ని ఇజ్రాయిల్, సౌదీ అరేబియా వ్యతిరేకించగా ఇరాన్, అమెరికాల్లో ప్రభుత్వ వ్యతిరేకులు కూడా వ్యతిరేకించారు. దీన్నుంచి 2018లో అమెరికా వైదొలగటమే గాక మరిన్ని కఠినమైన ఆంక్షలను ప్రకటించింది.ఇరాన్తో ఎవరు వాణిజ్య లావాదేవీలు జరిపినా ఆ దేశాల మీద కూడా చర్యలు తీసు కుంటామని ప్రకటించింది. దాంతో మనదేశం అక్కడి నుంచి చమురు కొనుగోలు నిలిపివేసింది.
ఒప్పందాన్ని ఉల్లంఘించిన అగ్రరాజ్యం!
ఒప్పందం ప్రకారం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి పదమూడేండ్లల్లో మధ్యతరహా శుద్ధిచేసిన యురేనియం మొత్తాన్ని తొలగించాలి, నిల్వల్లో 98శాతం కోత పెట్టాలి, గ్యాస్ సెంట్రిఫ్యూజుల్లో మూడోవంతు తగ్గించాలి.పదిహేను సంవత్సరాల పాటు భారజల కేంద్రాలను నిర్మించరాదు, యురేనియంను 3.67శాతమే శుద్ధి చేయాలి.పదేండ్లలో తొలితరం శుద్ధి కేంద్రానికే పరిమితం కావాలి, మిగిలిన కేంద్రాలను అణువ్యాప్తి నిరోధించే కేంద్రాలుగా మార్చాలి. వీటన్నింటినీ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణకు అంగీకరించాలి.దీనికి ప్రతిఫలంగా అమెరికా, ఐరోపా యూనియన్, ఐరాస భద్రతా మండలి విధించిన అణు సంబంధ ఆంక్షలన్నీ ఎత్తివేయాలి. ఈ ఒప్పందం ఎనిమిదేండ్లు లేదా ఒప్పందం అమలు జరిగినట్లు అణు ఇంధన సంస్థ నిర్ధారించేవరకు అమల్లో ఉండాలని భద్రతామండలి తీర్మానించింది. 2016లో అధికారానికి వచ్చిన డోనాల్డ్ ట్రంప్ ఒప్పందం నుంచి వైదొలుగనున్నట్లు సాంకేతికంగా చెప్పకపోయినా 2017 అక్టోబరు 12న తమ దేశ చట్టాల ప్రకారం ఒప్పందాన్ని నిర్దారించలేమని ప్రకటించాడు.2018 మార్చి నెలలో ఐఏఇఏ సమర్పించిన నివేదికలో ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి అమలు చేస్తున్నదని పేర్కొన్నది. అయితే ఇరాన్ రహస్యంగా అమలు చేస్తున్న ఆయుధ కార్యక్రమం గురించి ఈ సంస్థకు వెల్లడించలేదని ఏప్రిల్ 30న అమెరికా, ఇజ్రాయిల్ ఆరోపిం చాయి. మే 18వ తేదీన ఒప్పందం నుంచి తాను వైదొలుగుతున్నట్లు అమెరికా ఏకపక్షంగా ప్రకటించింది. తర్వాత నవంబరు నుంచి అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. తాము ఒప్పందానికి కట్టుబడి ఉండేది లేదని 2020జనవరి ఐదున ఇరాన్ ప్రకటించింది, అయితే అణుఇంధన సంస్థతో సమన్వయం చేసుకుంటామని ప్రకటించింది.
‘అణు’ భవిష్యత్తేమిటి?
ఈ ఒప్పంద పూర్వరంగాన్ని పరిశీలించకపోతే సమగ్రత రాదు.1970లో ఇరాన్ అణుకార్యక్రమాన్ని ప్రారం భించింది. అయితే ఆనాడు అక్కడ అమెరికా అనుకూల రాజు ఉండటంతో శాంతికోసం అణువులు అనే కార్యక్రమం కింద సాయం చేస్తామని, దానికి ప్రతిగా అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పిటి) మీద సంతకం చేయించింది అమెరికా. 1979 ఇరాన్ రివల్యూషన్లో అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి అయాతుల్లా రుహల్లా ఖొమైనీ అధి కారానికి వచ్చాడు. ఎన్పిటి అమలు సందేహాస్పదమైంది. అనేక మంది అణు శాస్త్రవేత్తలు ఇరాన్ నుంచి పారిపోయారు. అణు పరిజ్ఞానం పట్ల ఖొమైనీ కూడా తొలిరోజుల్లో ఆసక్తి చూపలేదు.1980దశకం చివరిలో ఎన్పిటిని పక్కన పెట్టి చైనా సాయంతో అణుకార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత పాకిస్తాన్, రష్యా కూడా దానికి సహకరించింది.2002లో పారిస్లో ఉన్న ఇరాన్ అసమ్మతివాదులు ఇరాన్ అణుకార్యక్రమం, కేంద్రాల గురించి వెల్లడించారు. తర్వాత ప్రభుత్వం కూడా వాస్తవమే అని చెప్పింది.2003లో అణువిద్యుత్ కేంద్రాల సందర్శనకు ఐఎయిఏ ప్రతినిధులను అనుమతించారు తప్ప నమూనాలను సేకరించేందుకు తిరస్కరించారు.ఎన్పిటి రక్షణ జాగ్రత్తలు తీసుకోవటం లేదని ఆ సంస్థ నివేదించింది. 2004లో కుదిరిన పారిస్ ఒప్పందం ప్రకారం తాత్కాలికంగా యురేనియం శుద్ధిని నిలిపివేసేందుకు అంగీకరించింది. అయితే తమ ప్రతినిధులు దేశద్రోహానికి పాల్పడ్డారని ప్రకటించిన ఇరాన్ 2006లో ఆ ఒప్పందం నుంచి వైదొలిగింది. తాము అణువిద్యుత్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకుంటున్నాం తప్ప అయుధాల కోసం కాదని ప్రకటించింది. దాంతో భద్రతా మండలి చేసిన తీర్మానంలో అణుశుద్ధి నిలిపివేయాలని కోరింది. క్షిపణి పరిజ్ఞానాన్ని అందచేయకూడదని ఇతర దేశాలను ఆదేశించింది, కొందరి ఆస్తులను స్తంభింపచేసింది.తర్వాత మరో ఐదు తీర్మానాలు చేసి ఆంక్షలు విధించింది. 2013లో అమెరికా చొరవతో చర్చలకు తెరతీశారు. ఆ తర్వాత ఏం జరిగిందీ పైన చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని ఏం చేస్తారు, తదుపరి చర్యలేమిటన్నది పెద్ద ప్రశ్న.
ఎం కోటేశ్వరరావు
8331013288