నవతెలంగాణ-హైదరాబాద్: గాజాలో మారణహోమానికి కారణమైన ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఆస్ట్రేలియా పర్యటనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అధికారిక పర్యటనలో భాగంగా మంగళవారం, బుధవారం ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మెల్బోర్న్, కాన్బెర్రాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఐజాక్ హెర్జోగ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పలు నగరాల్లో వేలాది మంది ఆస్ట్రేలియన్లు నిరసనలకు దిగారు. ప్రధానంగా పాలస్తీనా యాక్షన్ గ్రూప్ నేతృత్వంలో ఈ ఆందోళనలు చేపట్టారు. పాలస్తీనియన్లపై అమానుష దాడిని ఖండిస్తూ ఇజ్రాయిల్ వ్యతిరేక యూదు సంస్థలు, మానవహక్కుల సంస్థలు కూడా ఈ నిరసనలకు మద్దతు తెలిపాయి.
ఈ నిరసనలను అణచివేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారీగా భద్రతా దళాలను మోహరించింది. 3,000మందికిపైగా భద్రతా దళాలు సిటీ హాల్స్క్వేర్లో గుమిగూడిన నిరసనకారులను చెదరగొట్టేందుకు యత్నించారు. భద్రతా దళాల చర్యలను కార్యకర్తలు ఖండించారు. ఈ చర్యలు పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయిల్ మారణహోమంతో ఏర్పడిన మానవ సంక్షోభంపై సామాజిక అసంతృప్తిని నిశ్శబ్దం చేసే యత్నంగా పేర్కొన్నారు.
‘హెర్జోగ్ మాకు ప్రాతినిధ్యం వహించరు’ అనే నినాదంతో వెయ్యిమందికి పైగా విద్యావేత్తలు మరియు నేతలు సంతకం చేసిన లేఖను ఆస్ట్రేలియా యూదు కౌన్సిల్ ప్రచురించింది. ఐజాక్కు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ దౌత్య ఆహ్వానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
హెర్జోగ్ను అధికారిక అతిథిగా స్వీకరించడం మానవహక్కుల పట్ల ఆస్ట్రేలియా నిబద్ధతను దెబ్బతీస్తుందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఆమ్నెస్టీ సభ్యులు కూడా నిరసనల్లో భాగస్వామ్యమయ్యారు. నిరసనకారులకు, సంవత్సరాల తరబడి సైనిక ముట్టడి మరియు గాజాస్ట్రిప్లోని పౌర జనాభాను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇజ్రాయిల్కి శిక్ష మినహాయింపు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. పాలస్తీనా మారణహోమంపై ఆస్ట్రేలియా ప్రజలు మౌనం వహించరని పునరుద్ఘాటించింది.
మార్చి 29న పాలస్తీనాకు గ్లోబల్ ఫ్లోటిల్లా సుముద్
పాలస్తీనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇజ్రాయిల్ అక్రమ ముట్టడిని ఎదుర్కొనేందుకు ఫ్లొటిల్లా మరోసారి అంతర్జాతీయ సంఘీభావాన్ని సమీకరిస్తోంది. గ్లోబల్ ఫ్లోటిల్లా సుముద్ (ఎస్పిఎఫ్) మార్చి 29న 100కి పైగా దేశాల నుండి 3,000మంది స్వచ్ఛంద సేవలకులతో పాలస్తీనాకు బయలుదేరుతుందని ధృవీకరించింది. ఆక్రమణ, భద్రతా దళాలు విధించిన దిగ్బంధనను విచ్ఛిన్నం చేసి, విధ్వంసంలో మునిగిపోయిన పాలస్తీనా జనాభాకు ఆశను కలిగించే లక్ష్యంతో అంతర్జాతీయ సమీకరణ చేపడుతున్నట్లు ఎస్పిఎఫ్ తెలిపింది.




