ఈనెల 13న ఇజ్రాయిల్ దేశం ఇరాన్పై మిస్సైళ్లతో దాడిచేసి యుద్ధం ప్రకటించింది. ఈ దాడిలో ఇరాన్ అణు ఉత్పత్తి స్థావరాలు కొన్ని దెబ్బతినటంతో పాటు, అణుశాస్త్రవేత్తలు, మిలటరీ ఆఫీసర్లు చాలామంది మరణించారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నదనీ, బాంబు తయారీకి ఇంకా రెండు నెలల దూరంలోనే ఉందనీ, ఈ పరిణామాలు తమదేశ ఉనికికే ప్రమాదమనీ అందువల్ల ఈ దాడి చేసామనీ ఇజ్రాయిల్ ప్రకటించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో వరుసగా ట్వీట్లు చేయటం మొదలుపెట్టాడు. ”ఈ దాడి ఇంతటితో ఆగదు. ఇరాన్ వెంటనే దిగిరావాలి. మాతో అణ్వాయుధ ఒప్పందం తక్షణం చేసుకోవాలి”, ”నేను ఇరాన్కు అరవైరోజుల గడువిచ్చాను. కానీ వాళ్లు నా మాట వినలేదు. అందుకే 61వ రోజునే ఇరాన్పై దాడులు జరిగాయి. ఇప్పటికైనా వాళ్లు నాతో ఒప్పందానికి రావాలి” అంటూ దాడి జరగ్గానే ఆయన పెట్టిన పోస్టులు చూస్తే ఇరాన్పై ఇజ్రాయిల్ దాడులు అమెరికా ప్రమేయం లేకుండా జరిగాయని అనుకోలేము. అంతేగాదు ట్రంప్ మహాశయుడు తన సోషల్ మీడియాలో మరో సంచలన పోస్టు పెట్టారు. ” ఇరాన్ నాయకుడు అయతుల్లా ఖుమైనీ ఎక్కడ దాక్కున్నారో నాకు తెలుసు. ఆయన్ను చంపటం నాకు చాలా తేలిక. కానీ ఇప్పుడే(ప్రస్తుతానికి) ఆయన్ను చంపాలని అనుకోవటం లేదు. కానీ ఇరాన్ వెంటనే మాతో ఒప్పందానికి రావాలి” ఇవీ ఆయన సోషల్ మీడియా సందేశాలు! ఎంత అహంకారం? ఒక దేశాధ్యక్షుడు, అందునా ప్రపంచ అగ్రరాజ్యంగా అందరికీ సుద్దులు చెప్పే నాయకుడు ఇలా చిల్లరగా మాట్లాడటం, మరో సార్వభౌమత్వ దేశంపై బెదిరింపులకు పూనుకోవటం తగునా?
ఈ యుద్ధ ప్రజ్వలన జరగుతుండగానే కెనడాలో జరుగుతున్న జి7 దేశాల సమావేశంలోంచి అర్దంతరంగా ట్రంప్ అమెరికాకు పయనమయ్యాడు. దానిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మాక్రాన్ ”ట్రంప్ మధ్యలోనే వెళ్లిపోవటం శాంతికోసమే. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కోసమే ఆయన వెళ్తున్నాడు” అని కామెంట్ చేశాడు. దానికి ట్రంప్ ”లేదు, ఎప్పుడూ ప్రచారం కోరుకునే మక్రాన్కు నేను సరిగా అర్థం కాలేదు. నేను వెళ్తున్నది శాంతి కోసం కాదు. అంతకంటే ఎక్కువ. త్వరలోనే మీకు అర్థమౌతుంది” అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ఉద్దేశాన్ని ఆచరణలో కూడా చూపుతున్నాడు. అమెరికా సైన్యాలను ఇరాన్కు సమీపంలోకి మొహరిస్తున్నారు. నావికా దళాలను, ఎయిర్క్రాఫ్ట్ కారియర్లను హిందూ మహా సముద్రంలోని డిగోగార్షియాకు తరలించారు. అంటే ఇరాన్ పై యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంటుందనే సంకేతాలిస్తున్నారు.
ఇరాన్తో ఉన్న అణ్వాయుధ నిరోధ ఒప్పందం నుండి అమెరికా ఇదివరకు తనకు తానే వైదొలిగింది. తిరిగి ఇపుడు మళ్లీ ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు 15తేదీన జరగాల్సి ఉండగా 13నే ఈ దాడి జరిగింది. నిజంగా అణ్వాయుధ తయారీని అడ్డుకోవాలనేదే లక్ష్యమైతే చర్చలకు ముందు ఇలా చేస్తారా? ఇరాన్ తాను అణ్వా యుధాలు తయారు చేయటం లేదనీ, విద్యుత్ ఇతర అభివృద్ధి అవసరాలకోసమే అణు పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామనీ చెబుతోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణు పర్యవేక్షణ సంస్థ (ఐఎఇఎ)కూడా ధృవీకరించింది. అంతేకాదు అమెరికా ఇంటిలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బర్డ్ కూడా ఇటీవల అమెరికన్ కాంగ్రెస్ ముందు ఇదే విషయాన్ని ప్రకటించాడు. దీనిపైన ట్రంప్ను ప్రశ్నిస్తే ”ఆమె ఏం చెప్పిందో తెలియదు. నేనామెను లెక్కచేయను” అని ఖరా ఖండిగా చెప్పేశాడు. అంతేగాదు ఇరాన్ అణ్వాయుధ తయారీని అడ్డుకునేందుకే తానీ దాడి చేశానని చెబుతున్న ఇజ్రాయిల్ దీన్ని ఎప్పుడో తయారు చేసి పెట్టు కుంది. కానీ అధికారికంగా ప్రకటించటం లేదు. ఇది ప్రపంచానికంతా తెలుసు. ఆ విషయంలో అమెరికా ఎందుకు మాట్లాడదు? కారణం స్పష్టం. అది తన మిత్రదేశం. పశ్చిమాసియాలో అమెరికా ఏజెంటుగా, బంటుగా ఇజ్రాయిల్ వ్యవహరిస్తోంది. కాబట్టి అది ఏం చేసినా సమర్ధించటం అమెరికాకు అవసరం.
అమెరికా చరిత్రంతా కూడా అదే. తనకు ఎదురు తిరిగిన ఏ దేశాన్నైనా అణచివేయటం, ఆ ప్రభుత్వాలను కూల్చివేయటం దానికి వెన్నతో పెట్టిన విద్య. గతంలో లిబియాలో, ఇరాక్లో, ఆప్ఘనిస్తాన్లో, ఇటీవల సిరియాలో చేసిందదే. ఇప్పుడు ఇరాన్లో చేయాలనుకుంటున్నదీ అదే. అక్కడి ప్రభుత్వాన్ని కూల్చటం దాని లక్ష్యం. ఇస్లామిక్ రాజ్యంగా ఇరాన్ అనుసరించిన అనేక అప్రజాస్వామిక విధానాలు, ముఖ్యంగా మహిళా స్వేచ్ఛ పట్ల తీసుకున్న వైఖరికి నిరసనగా ఆ దేశంలో జరిగిన అంతరంగిక అలజడులు ఇందుకు తోడ్పడతాయని అమెరికా ఆశ. కానీ ఆ విభేదాలను పక్కనబెట్టి ఇజ్రాయిల్ దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలు ఐక్యంగా తమ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న సూచనలే ఎక్కువ గోచరిస్తున్నాయి. ఇరాక్లో సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూల్చటానికి, ఆ దేశంపై దాడిచేసి నాశనం చేయటానికి, ఆ దేశంలో ‘రసాయనిక ఆయుధాలు’ తయారు చేస్తున్నారని సాకు చెప్పింది. తీరా ఆ దేశాన్ని నాశనం చేసి, సద్దాంను ఉరితీశాక రసాయనిక ఆయు ధాలు ఉత్పత్తి ‘ఉత్తిదే’ అని తేల్చేసింది.
పశ్చిమాసియా అపారమైన ఆయిల్, గ్యాస్ ఇతర సహజ వనరులున్న ప్రాంతం. దానిపైన ఆధిపత్యం, సంపదల దోపిడీ అమెరికన్ సామ్రాజ్యవాదుల, కార్పొరేట్ శక్తుల లక్ష్యం. ఈ ప్రయోజనాల రక్షణకు సామ్రాజ్యవాదుల ప్రతినిధిగా ఇజ్రాయిల్ వ్యవహరిస్తోంది. అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులకు ఇరాన్ అండదండలిస్తోంది. లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీలు, గాజాలో హమాస్ సంస్థలు ఇంకా ఇరాక్, సిరియా దేశాల్లోని మిలిటెంట్ గ్రూపులు ఇజ్రాయిల్కు, అమెరికాకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఈ శక్తులను అణచివేయటం, తన పెత్తనాన్ని ఈ ప్రాంతంలో కొనసాగించటం అగ్రరాజ్య లక్ష్యం. అందులో భాగమే గతేడాది అక్టోబర్ నుండి గాజాపై ఇజ్రాయిల్ దాడులపర్వం, సాగిస్తున ‘నరమేధం’ ప్రపం చం చూస్తున్నదే. ఇప్పటికే అరవైవేల మంది ప్రజలు ఈ ఊచకోతలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు మహిళలు, పిల్లలే.
ఇజ్రాయిల్ సహకారంతో ఇటీవల సిరియాలో అసాద్ ప్రభుత్వం కూలిపోవటం, లెబనాన్పై దాని దాడులతో హెజ్బుల్లా సంస్థ బలహీనపడటం, గాజాలో హమాస్ కూడా కొంత దెబ్బతినటం వంటి పరిణామాలు ఇజ్రాయిల్ ఇరాన్పై దాడికి తెగబడే ఉత్సాహానికి కారణమై ఉంటాయి. దానికితోడు అమెరికా అధ్యక్షుడుగా ఇజ్రాయిల్కు, దాని అధ్యక్షుడు నెతన్యాహుకు అత్యంత సన్నిహితంగా మెలిగే ట్రంప్ కొలువుదీరటం తోడయ్యాయి. ఇరాన్పై ఈ దాడికి ఇంకా కొన్ని ప్రపంచ పరిస్థితులు కూడా కారణమవుతుండవచ్చు. ఇదివరకు ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు తమ ఆయిల్ను డాలర్లలోనే ప్రపంచానికి అమ్మాలనే ఒప్పందం అమెరికా చేసుకుంది. ఆ గడువు ఇటీవల ముగిసింది. తిరిగి దాన్ని పునరుద్ధరించటానికి ఆ దేశాలు(ఇవన్నీ దాదాపు పక్షిమాసియాలోనే ఉన్నాయి) సిద్ధపడలేదు. వేరే కరెన్సీల్లో ఆయిల్ ఆమ్ముతున్నాయి. ముఖ్యంగా చైనా, రష్యాలు ఈ విషయంలో ప్రాబల్యం పెంచుకుంటున్నాయి. క్రమంగా పశ్చిమాసియా దేశాలు సౌదీ అరేబియాతో సహా బ్రిక్స్లో చేరటానికి ఉత్సాహం చూపుతున్నాయి. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా,ఇండియా, చైనా,దక్షిణాఫ్రికా) బ్రిక్స్+గా మారింది. ఇరాన్తో సహా మరో 10దేశాలు అందులో చేరాయి. ఇంకా ఏకంగా నలభై దాకా దేశాలు అందులో చేరటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ దేశాలు అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని, దానివల్ల జరుగుతున్న నష్టాలను తప్పించుకోవటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. అమలు చేసే ప్రయత్నమూ చేస్తున్నాయి. అమెరికా ప్రపంచాధిపత్యానికి ఇంకా మిగిలి ఉన్న ఆయువుపట్టు అమెరికన్ డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉండటం ఒకటైతే, దానికి విస్తారంగా ఉన్న మిలటరీ బేస్లు, దాని ఆయుధ సంపత్తి మరో వనరుగా ఉంది. ఇప్పుడు ఈ మూలాలకే ఎసరొచ్చే ప్రమాదం ఎదురవుతున్నది. దీన్ని నివారించాలంటే పశ్చిమాసియాపై అమెరికాకు తిరుగులేని ఆధిపత్యం అనేది కూడా ఒక ముఖ్య అవసరంగా మారింది. అందుకే ఈ ప్రాంతంలో అమెరికా వ్యతిరేక శక్తులు, వాటికి దన్నుగా ఉన్న ఇరాన్ను అమెరికా లక్ష్యంగా చేసుకుంటున్నది. అందువల్ల ఈ సమస్యను ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంగా మాత్రమే చూస్తే సరిపోదు. ఇది అమెరిన్ సామ్రాజ్యవాద అధిపత్య ప్రయత్నంగా, ప్రపంచ ప్రజల శాంతి కాముక ఆకాంక్షలకు ఆటంకంగా చూడాలి. అడ్డుకునే ప్రయత్నం చేయాలి.
జరుగుతున్న ఈ ఘర్షణ లేక యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంటుందా? ట్రంప్ బెదిరిస్తున్నట్లు అమెరికా మాత్రమే కలిగి ఉన్న బంకర్ బ్లస్టర్ బాంబులను ప్రయోగిస్తుందా? ఇరాన్ ఈ దాడిని తట్టుకుంటుందా? అనే ప్రశ్నలకు ఇంకొంత కాలంలో సమాధానాలు దొరుకుతాయి. అయితే లొంగిపోవటానికి, ఓడిపోవటానికి ఇరాన్ సిద్ధపడదానేది వాస్తవం. ఇరవైఏండ్ల పాటు ఆ దేశంలో తిష్ట వేసినా చివరకు పరాభవంతో పలాయనం చిత్తగించిన ‘ఆప్ఘనిస్తాన్ ఆక్రమణలో అమెరికా చరిత్ర’ మనకు తెలుసు. అంతకంటే ఎంతో బలమైన ఇరాన్ లొంగదీయటం ఇజ్రాయిల్కు సాధ్యమయ్యే పని కాదు. ఇరాన్కు మరో ప్రత్యోకత కూడా తోడవుతుంది. వైమానిక దాడులెన్ని జరిగినా, ఎన్ని నష్టాలు సంభవించినా పదాతి దళాల ప్రమేయం లేకుండా ఒక దేశాన్ని ఆక్రమించటం లేక లొంగదీయటం అసంభవం. లిబియా, ఇరాక్, ఆప్ఘనిస్తాన్ వగైరా దేశాల విషయంలో లాగా ఇరాన్లోకి పదాతి దళాలు ప్రవేశించటం వివిధ కారణాల రీత్యా జరిగే పనికాదు. అందువల్ల అమెరికా రంగంలోకి దిగినా దానికి పరాభవం తప్పని పరిస్థితులే కనపడుతున్నాయి. ఇజ్రాయిల్, అమెరికాల ఈ దుష్ట పన్నాగాలను ప్రపంచ దేశాలు ఖండించాలి. యుద్ధ నివారణకు ఒత్తిడి తేవాలి. ”ఇరాన్ సార్వభౌమత్వానికి తాము రక్షణగా ఉంటామని చైనా ఇప్పటికే ప్రకటించటం ఆహ్వానించదగినది. అలాగే మిగతా దేశాలూ ముందుకు రావాలి.
కానీ ఇండియా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. మితిమీరిన అమెరికా స్నేహంతో దాని అడుగులకు మడుగులొత్తే స్థితికి దిగజారి ఇరాన్పై ఇజ్రాయిల్ దాడిని సమర్ధించే వైఖరి తీసుకుంటోంది. పశ్చిమాసియాలో పాలస్తీనా సమస్యపై ఇన్నాళ్లుగా భారత ప్రభుత్వమూ, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ సుదీర్ఘంగా అనుసరిస్తూ వచ్చిన విధానానికి ఇది విరుద్ధం. పాలస్తీనా ప్రజల ప్రజాస్వామిక డిమాండ్కూ, ఇరాన్ దేశంతో మనకున్న చిరకాల చారిత్రిక మైత్రికీ ఇది పూర్తి వ్యతిరేకం. దక్షిణాది దేశాల నాయకుడిగా తనకుతాను చెప్పుకునే మోడీ ప్రకటనలకు విరుద్ధంగా, దక్షిణాది దేశాల వైఖరికి పూర్తి భిన్నంగా ఈ వైఖరి తీసుకోవటం భారత్ భవిష్యత్ ప్రయోజనాలకు భంగకరం. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ధోరణిని తక్షణమే మార్చుకోవటం, గాజా, ఇరాన్లపై ఇజ్రాయిల్ దాడులను ఖండించటం, ప్రజాస్వామిక విలువల వైపు నిలబడటం అవ సరం. లేనట్లయితే విలువల రీత్యానేగాక ఆర్థికంగా, దౌత్యపరంగా మన దేశం తీవ్రంగా నష్టపోతుంది.
తమ్మినేని వీరభద్రం